‘ప్రేమజ్యోతి’ని ఆర్పేశాడు

19 Dec, 2017 08:20 IST|Sakshi

భార్య గొంతు నులిమి చంపేసిన భర్త మనోహర్‌

అంగర పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

వాకతిప్ప (కపిలేశ్వరపురం): ప్రేమగా అందరినీ పలకరించే ‘జ్యోతి’ ఆరిపోయింది. కట్టుకున్న భర్తే గొంతు నులిమి చంపేశాడు. ఏమీ తెలియనట్టు పరారయ్యాడు. అందరినీ కలచి వేసిన ఈ ఘటన కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో ఆదివారం జరిగింది. అంగర పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. వాకతిప్ప గ్రామానికి చెందిన దోమల ప్రేమజ్యోతి (25)ని ఎనిమిదేళ్ల క్రితం మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన దోమల మనోహర్‌కు ఇచ్చి వివాహం చేశారు.

తరచూ గొడవలు పడుతుండడంతో దగ్గరుంటే జాగ్రత్తగా ఉంటారనుకుని భావించి ప్రేమ జ్యోతి కుటుంబ సభ్యులు వాకతిప్పలోని ఇంటికి తీసుకొచ్చారు. మనోహర్‌ కూడా ప్రేమజ్యోతితోపాటే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం ఎంత సేపటికీ నిద్ర లేవకపోవడంతో మధ్యాహ్న సమయంలో కదిపి చూడగా ప్రేమ జ్యోతి చనిపోయి ఉంది. ఆమె సోదరుడు గురజ శ్రీను ఫిర్యాదు మేరకు ఆదివారం రాత్రి రామచంద్రపురం డీఎస్పీ జేవీ సంతోష్, మండపేట రూరల్‌ సీఐ లక్షణరెడ్డి, అంగర ఎస్సై రాజేష్‌కుమార్‌లు ఘటనా స్థలాన్ని సందర్శించి శవపంచనామా చేశారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్టు భర్త మనోహరే గొంతు నులిమి చంపేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.

మారకపోగా మనిషినే చంపేశాడు..
తరచూ వివాదపడడాన్ని చూసి మనిషి మారతాడన్న భావనతో ప్రేమజ్యోతిని కుటుంబ సభ్యులు అమ్మగారి ఊరులోనే ఉంచుకున్నారు. మారకపోగా మనిషినే చంపేశాడంటూ కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. అమ్మ ప్రేమకు దూరమైన  ప్రేమజ్యోతి ఆరేళ్ల కుమార్తె అమూల్య స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. నాన్నే అమ్మ చావుకు కారణం కావడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.

మరిన్ని వార్తలు