నా పిల్లలను ఇప్పించండి సారూ..!

2 Apr, 2018 07:18 IST|Sakshi
భార్యాపిల్లలతో రమణానాయక్‌

నల్లమాడ: భార్య తనవెంట తీసుకెళ్లిన పిల్లలను తనకు ఇప్పించాలని సి.రెడ్డివారిపల్లికి చెందిన ఎస్‌.రమణానాయక్‌ వేడుకొంటున్నాడు. ఆదివారం ఎస్‌ఐ సత్యనారాయణను కలసి పిల్లలను తన వద్దకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇటీవల తన భార్య జయమ్మ పదేళ్ల కుమారుడు ప్రదీప్‌నాయక్, ఆరేళ్ల కుమార్తె లాస్యాబాయిని తీసుకొని ఇంటినుంచి వెళ్లిపోయిందన్నాడు.

ఇంతవరకు వారి ఆచూకీ లభించలేదన్నాడు. గతంలో కూడా తన భార్య ఇంటినుంచి వెళ్లిపోగా పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి మందలించి ఇంటికి పంపినట్లు చెప్పాడు. తన భార్య పిల్లలను తీసుకొని ఇంటినుంచి వెళ్లిపోవడం వెనుక గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హస్తం ఉందని, ఇందుకు సంబంధించిన ఆధారాలు గతంలోనే పోలీసులకు దొరికాయని బాధితుడు తెలిపాడు. పోలీసులు స్పందించి పిల్లలను తన వద్దకు చేర్చాలని కోరాడు. ఈ మేరకు కలెక్టర్‌కు కూడా విన్నవించినట్లు చెప్పాడు. 

>
మరిన్ని వార్తలు