తాను ఏ ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా మాట్లాడలేదని సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. పెద్దలు చేసిన తప్పిదాలు భవిష్యత్ తరాలపై పడ్డాయని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ హైదరాబాద్లో శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడుతూ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన సరిగా జరగలేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పెద్ద మనుషుల ఒప్పందం సరిగా పాటించకపోవటం వల్లే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు కొట్టుకునే స్థితి రాకూడదని కోరినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. విభజన కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని... అధికారులే కాదు పోలీసులు కూడా కొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. తన పోరాటం అధికారం కోసం కాదని, ప్రజల కోసమని ఆయన అన్నారు.