సెంటిమెంట్ ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తా

24 Dec, 2014 00:03 IST|Sakshi
సెంటిమెంట్ ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తా

అప్పనపల్లి(మామిడికుదురు) : సెంటిమెంట్ ప్రాధాన్య చిత్రాల్లోనే నటిస్తానని ప్రముఖ సినీ నటి హేమ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామివారిని ఆమె మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. హాస్య పాత్రలకన్నా సెంటిమెంట్ ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించాలన్నది తన అభిమతమన్నారు. ప్రస్తుతం వాటికే ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పారు.

ప్రముఖ దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్ సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రంతో పాటు ఆయన దర్శకత్వంలోనే రూపొందుతున్న మరో చిత్రంలో కూడా నటిస్తున్నానని హేమ తెలిపారు. దీంతోపాటు శ్రీకాంత్, అల్లరి నరేష్‌లు హీరోలుగా నిర్మిస్తున్న మరో రెండు చిత్రాల్లో కూడా నటిస్తున్నానన్నారు. తెలుగులో విజయం సాధించిన ‘జులాయి’ తమిళ రీమేక్‌తోపాటు మరో తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నానని చెప్పారు. తాను నటించిన అయిదు చిత్రాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు.

ఇష్టదైవం వేంకటేశ్వరస్వామి
వేంకటేశ్వరస్వామి తన ఇష్టదైవమని హేమ చెప్పారు. అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి అంటే చిన్నప్పటి నుంచీ తనకు ఎంతో నమ్మకమన్నారు. ఆరేళ్ల వయసు నుంచి క్రమం తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటున్నానన్నారు. స్వామివారిని ఏం కోరుకున్నా నూరు శాతం అది నెరవేరుతుందన్నారు. స్వామివారి ఆశీస్సులతోనే తాను సినీ రంగంలో స్థిరపడ్డానన్నారు. రాజోలులో తన ఇంటికి వచ్చిన ప్రతిసారీ స్వామివారిని దర్శించుకుని వెళ్లడం అలవాటని ఆమె చెప్పారు.
 

మరిన్ని వార్తలు