సార్... చోర్ ఐటీడీఏలోనూ నకిలీలు

9 Jan, 2014 03:02 IST|Sakshi
సార్... చోర్ ఐటీడీఏలోనూ నకిలీలు

=ఉపాధ్యాయుల ప్రమోషన్లలో అక్రమాలు
 =నకిలీ ధ్రువపత్రాలతో 11 మంది ఉద్యోగోన్నతి
 =ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన బాధితులు
 =త్వరలో విచారణ..

 
సాక్షి, హన్మకొండ: జిల్లా విద్యాశాఖను పట్టిపీడిస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం.. ఇప్పుడు ఐటీడీఏనూ కుదిపేస్తోంది. ఈ సంస్థ 2012 మేలో చేపట్టిన ప్రమోషన్లలో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఏకంగా 11 మంది ఉపాధ్యాయులు లబ్ధిపొందారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ పరిధిలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందిన 16 మంది ఉపాధ్యాయులను డీఈవో విజయ్‌కుమార్ సస్పెండ్ చేయగా మరో ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ రీజనల్ జాయింట్ డెరైక్టర్‌కు లేఖ రాశారు.

ఈ అంశంపై చర్యలు సాగుతుండగానే.. ఐటీడీఏలోనూ నకిలీలు ఉన్నారనే విషయం బయటపడింది. దీనిపై త్వరలోనే విచారణ చేపట్టనున్నారని తెలుస్తోంది. పైగా నకిలీ సర్టిఫికెట్లలో ఎక్కువగా.. కులం, ఏజెన్సీకి సంబంధించిన అంశాలు ఉండడంతో ఈ వ్యవహారంలో తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాత్రపై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. కుల, బధిర, తప్పుడు ఏజెన్సీ పత్రాలు సమర్పించి ప్రమోషన్ పొందినట్లుగా తేలడంతో రేపోమాపో తమపై వేటు తప్పదనే ఆందోళనలో ‘నకిలీ’ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిని కాపాడేందుకు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ‘తప్పుడు’ ప్రమోషన్ల అంశంపై ట్రిబ్యునల్‌కి వెళ్లిన వ్యక్తులతో చర్చలు జరుపుతున్నారు.
 
2012 పదోన్నతుల వేదికగా

ఐటీడీఏ ఏటూరునాగారం, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 50 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఆశ్రమ, గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇందులో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ప్రమోషన్లకు గాను పోస్టు గ్రాడ్యుయేట్ హెడ్‌మాస్టర్ గ్రేడ్-2 పోస్టులు 27 మంజూరయ్యాయి. వీటిలో మైదాన ప్రాంతానికి సంబంధించి పది ఉండగా ఏజెన్సీ పరిధిలో 15 ఉన్నాయి. వీటికి సంబంధించి 2011-12 ప్రమోషన్ లిస్టును రూపొందించారు. సీనియారిటీ జాబితా ప్రకారం అర్హతలు ఉన్న ఊపాధ్యాయులకు 2012 ఏప్రిల్ 4న ఇంటర్వ్యులు జరగాల్సి ఉంది. అయితే హటాత్తుగా ఈ ఇంటర్వ్యులను ఐటీడీఏ అధికారులు రద్దు చేశారు.
 
జీవో 3తో చిక్కులు..
 
ఐటీడీఏ ద్వారా నియూమకాలు చేపట్టిన ప్రారంభంలో ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ తేడాలు లేకుండా చేపట్టారు. కానీ, ఆ తర్వాత 2000 సంవత్సరం జనవరిలో ప్రభుత్వం జీవో నంబరు 3ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఐటీడీఏ పరిధిలో జరిగే ఉపాధ్యాయ నియూమకాలకు సంబంధించి ఏజెన్సీ నివాస ధ్రువీకరణ పత్రం ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తారు. 2011-12 పదోన్నతుల లిస్టులో ఉన్న ఉపాధ్యాయులంతా 2000కు ముందు నియామకమైన వారే.  సీనియార్టీ లిస్టులో ఉన్న ఉపాధ్యాయుల్లో చాలా మందికి జీవో నంబరు 3 అడ్డంకిగా మారింది.  
 
వాయిదాతో..

 2012 ఏప్రిల్ 4న జరగాల్సిన ఇంటర్వ్యులను 2012 మే 28 తేదీకి వాయిదా వేశారు. ఈ నెల రోజుల వ్యవధిలో కొందరు ఉపాధ్యాయులు.. కులం, ఏజెన్సీ, బధిర తదితర ధ్రువీకరణ పత్రాలను నకిలీవి సృష్టించి ఇంటర్య్వుకు హాజరయ్యారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వీటిని సరిగా పరిశీలించకుండానే అధికారులు హడావుడిగా పదోన్నతులు ఇచ్చారు. కొందరైతే ఇంటర్వ్యులో కాకుండా.. పదోన్నతులు పొంది పాఠశాలలు తెరిచిన తర్వాత 2012 జూన్ 16న పత్రాలు సమర్పించారు.  

ఒక్కో ఉపాధ్యాయుని దగ్గర రెండు లక్షల రూపాయలు వసూలు చేసి ఈ పదోన్నతుల వ్యవహారంలో ఐటీడీఏ సిబ్బంది సహకారం అందించినట్లుగా అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. నకిలీ ఏజెన్సీ ధ్రువపత్రాలతో ఎనిమిది మంది పదోన్నతులు పొందగా, నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు పీఈటీలకు హెడ్‌మాస్టర్లుగా పదోన్నతి కల్పించారు. అంతేకాదు అగ్రవర్ణాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు సైతం తప్పుడు కులధ్రువీకరణ ప్రతం, మరొకరు తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించి ప్రమోషన్లు పొందారని ఐటీడీఏ ఉపాధ్యాయుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో నష్టపోయిన కొందరు ఉపాధ్యాయులు సమాచార శాఖ కమిషన్ ద్వారా వివరాలు తీసుకుని ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. నకిలీ బధిర ధ్రువీకరణ పత్రాల కుంభకోణం జిల్లాలో వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఐటీడీఏ వ్యవహారంపై అధికారులు నిఘా వేశారు. అందులో భాగంగానే విచారణకు ఉద్యుక్తులవుతున్నారు.

మరిన్ని వార్తలు