పెళ్లి వేడుకపై ప్రతిష్టంభన

31 Aug, 2018 13:11 IST|Sakshi
బొందిమడుగులలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు

కర్నూలు, తుగ్గలి: మండలంలోని బొందిమడుగుల గ్రామంలో శుక్రవారం జరుగనున్న పెళ్లిపై ప్రతిష్టంభన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొందిమడుగుల గ్రామానికి చెందిన దళితుడు రాజుకు తుగ్గలికి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లి కుమార్తెకు వయసు లేదంటూ తహసీల్దార్‌ రామకృష్ణకు కొందరు సమాచారమివ్వడంతో ఆయన ఐసీడీఎస్‌ అధికారులను విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో గురువారం పెళ్లి కూతురు వయసుపై తుగ్గలి పోలీస్‌ స్టేషన్‌లో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పద్మావతి విచారణ చేపట్టారు. పెళ్లి కుమార్తె ఆధార్‌ కార్డు ప్రకారం అమ్మాయి వయసు తక్కువగా ఉందన్నారు. కాగా పెళ్లి కూతురు హైదరాబాద్‌లో 10వ తరగతి పూర్తి చేసిందని, అందుకు సంబంధించి పత్రాలను వారి కుటుంబ సభ్యులు పోలీసులకు అందజేశారు.

ఆధార్‌కార్డు, స్టడీకి సంబం«ధించిన పత్రాలో పెళ్లి కూతరు వయసు వ్యత్యాసం ఉండడంతో జిల్లా చైల్డ్‌లైన్‌ ఆఫీసర్‌ విచారణ చేసి నిర్ణయం చెబుతారని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ తెలిపారు. అధికారులు వధువు వయసును నిర్ధారించాల్సి ఉంది. పెళ్లిపై ప్రతిష్టంభన కొనసాగడంతో వధువు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెళ్లి వేడుక సమస్యాత్మకంగా మారుతుందని పసిగట్టిన పోలీసులు బొందిమడుగుల గ్రామంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డోన్‌ డీఎస్పీ ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో పత్తికొండ, బేతంచెర్ల సీఐలు భాస్కరరెడ్డి, కంబగిరి రాముడు, తుగ్గలి, జొన్నగిరి, పత్తికొండ, దేవనకొండ ఎస్‌ఐలు పులిశేఖర్, సతీష్‌కుమార్, మారుతి, శ్రీనివాసులు, గంగయ్యయాదవ్‌తో పాటు 50మందికి పైగా బందోబస్తు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు