ప్రచారానికి రాకపోతే పసుపు కుంకుమ రానివ్వం

21 Mar, 2019 07:44 IST|Sakshi
ఎమ్మెల్యే రామానాయుడు సతీమణి సూర్యకుమారి వెంట నడుస్తున్న డ్వాక్రా మహిళలు

సాక్షి, యలమంచిలి: పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఆయన సతీమణి సూర్యకుమారి చేస్తున్న ఎన్నికల ప్రచారం డ్వాక్రా మహిళలకు కొత్త చిక్కులు తెచ్చింది. ఎమ్మెల్యే నిమ్మల ఆదేశాలతో స్థానిక నాయకులు ఎన్నికల ప్రచారానికి రాకపోతే మీకు వచ్చే పసుపు కుంకుమ సొమ్ములు, డ్వాక్రా  రుణాలు, రాయితీలు, కుట్టుమిషన్లు రానివ్వబోమని డ్వాక్రా లీడర్లను, అంగన్‌వాడీ టీచర్లను, మధ్యాహ్న భోజన పథకం వలంటీర్లను భయపెడుతున్నారు. ప్రచారానికి మీరు రావడమే కాదు డ్వాక్రా సంఘాల్లోని మహిళలను కూడా తీసుకురావాలని లీడర్లను ఒత్తిడి చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం లీడర్ల బ్లాక్‌మెయిలింగ్‌కు భయపడుతున్న డ్వాక్రా లీడర్లు మహిళల వద్దకు వెళ్లి నయానో భయానో వారిని ఎన్నికల ప్రచారానికి తరలిస్తున్నారు. ఎండలు మండిపోతుండుటతో మహిళలు ప్రచారంలో తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రచారానికి వెళ్లకపోతే పసుపు కుంకుమ సొమ్ములు పడవని తమ డాక్రా లీడర్‌ భయపెడుతోందని మహిళలు వాపోతున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున డ్వాక్రా సీఎలు, అంగన్‌వాడీ టీచర్లు, మధ్యాహ్న భోజన పథకం వలంటీర్లు ప్రచారంలో పాల్గొనకూడదు. అధికార పార్టీ నాయకులకు ఇవేమీ పట్టడం లేదు.  ఎన్నికల అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు.   

>
మరిన్ని వార్తలు