భయం వీడితేనే జయం

6 Mar, 2014 00:15 IST|Sakshi

ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి
 విద్యార్థులు పరీక్షలకున్న సమయాన్ని బట్టి ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఎక్కువ మార్కులు సాధించాలనే తపనతో అదే పనిగా చదవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎంత చది వామని కాకుండా చదివింది ఎంత గుర్తుంచుకున్నామన్నది ముఖ్యం. చదివిన అంశాలు కనీసం ఒక్కసారైనా చూడకుండా రాయడం మంచిది. చదివిన అంశాలను పునశ్చరణ చేయడం కూడా ఎంతో ప్రధానం. ముఖ్యంగా రాత్రి వేళల్లో 10.30 కల్లా చదవడం ముగించి వేకువ జామున ఎక్కువ సమయం చదువుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది. విద్యార్థులకు కష్టంగా అనిపించే సబ్జెక్టులకు ఎక్కు సమయం కేటాయించాలి. వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రోజూ ప్రతి సబ్జెక్టుకు కనీసం గంట తక్కువ కాకుండా టైమ్ టేబుల్ తయారు చేసుకొని తదనుగుణంగా సాధన చేయాలి.  - హరిశ్చంద్ర, జిల్లా ఉప విద్యాధికారి

 టీవీలు, సినిమాలకు దూరంగా ఉంచాలి
 పరీక్షల సమయంలో పిల్లలను సాధ్యమైనంత వరకు టీవీలు, సినిమాలకు దూరంగా ఉంచాలి. వీటి వ్యాపకంతో విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించే వీలుండదు. తల్లిదండ్రులు ఇంటి వద్ద విద్యార్థులకు సరైన గెడైన్స్ ఇచ్చి కష్టపడి చదివేలా ప్రోత్సహించాలి. పేరెంట్స్ ఇద్దరూ ఉద్యోగులైతే ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని చదివించాలి. పరీక్షల సమయంలో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయడం ఏ మాత్రం మంచిది కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఒత్తిడికి గురి చేస్తే విద్యార్థుల మానసిక సంఘర్షణకు గురయ్యే ప్రమాదముంది.
 - ఝాన్సీరాణి,  ప్రధానోపాధ్యాయురాలు,  బాలికల ఉన్నత పాఠశాల,  

 
 ఆహార నియమాలు, నిద్ర, వ్యాయామం తప్పనిసరి  
 పరీక్షల సమయంలో ఆరోగ్య పరిరక్షణకు ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. పాలు తాగడం, సీజనల్ పండ్లు తినడం, జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి.

 అల్పాహారంగా ప్రొటీన్, కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు
 తీసుకోవాలి.

 వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినడం మంచిది. ఇడ్లి, దోశ, ఉప్మా వంటివి తీసుకోవచ్చు.

 చాక్లెట్లు, బిస్కెట్ల వంటివి తినడం మానేసి వాటి స్థానంలో ఎండిన పండ్లు, ఖర్జూర, బాదం, వాల్‌న ట్స్ వంటివి తీసుకోవాలి.
 పెరుగు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల మానసిక ఉపశమనం కలుగుతుంది. ఆరెంజ్, దానిమ్మ, ఆపిల్ లాంటి పండ్లను ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది.

 పరీక్షలకు సిద్ధమయ్యే, రాయబోయే విద్యార్థులందరికీ చదువెంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. పరీక్షల సమయంలో మానసిక  ఒత్తిడి అధికంగా ఉంటుంది. కాబట్టి రోజుకు కనీసం ఐదారు గంటలైనా తప్పనిసరిగా నిద్ర అవసరం.
 - ప్రసాద్‌కుమార్, వైద్యాధికారి, దోమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

 
 ఆరోగ్యం ప్రధానం
 చాలామంది విద్యార్థులు ఆరంభం నుంచి చదువును అశ్రద్ధ చేసి ఆటపాటలతో గడిపి తీరా పరీక్షలు దగ్గరకొచ్చాక నానా హడావుడీ పడుతుంటారు. రాత్రంతా గంటల తరబడి మేల్కొని చదివేస్తుంటారు. దీంతో వారిపై ఒత్తిడి అధికమవుతుంది. ఈ కారణంగా అనారోగ్యానికి గురయ్యే వీలుంది. ఇది మొదటికే మోసం తెస్తుంది. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో సమతుల ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. నీటిని ఎక్కువగా తాగడం, తగిన మోతాదులో ఆహారం తీసుకోవడం, చదువు మధ్యలో విరామం తీసుకొని సంగీతం వినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తే శరీరంపై ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 - ప్రకాష్‌రావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల

 ఈ జాగ్రత్తలు ఎంతో  అవసరం
 పరీక్షల సమయంలో రోజుల తరబడి నిల్వ ఉంచిన పదార్థాలు, నూనె పదార్థాలు, జీర్ణ సంబంధ సమస్యలు కలిగించే ఆహార పదార్థాలు తీసుకోరాదు.


టీవీలు, సినిమాలు చూడడం కన్నా చదువు మధ్యలో స్నేహితులతో కాసేపు సరదాగా గడపడం, కబుర్లు చెప్పుకోవడం మంచిది.
అనవసరమైన, చదువుకు నష్టం కలిగించే వ్యాపకాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి.

 {పస్తుతం గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా అన్ని చోట్లా విద్యుత్ కోతలు విపరీతంగా ఉండే అవకాశం ఉండడంతో విద్యార్థులు చదువుకు ఆటంకం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.

మరిన్ని వార్తలు