‘దమ్ముంటే కడపకు వచ్చి మాట్లాడు’

21 Dec, 2017 16:18 IST|Sakshi

విజయవాడ : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పై కడప స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వర్మకు కేవలం ఫ్యాక్షన్ హత్యలు తప్ప..‌ రాయలసీమలోని మహానుభావులు కనిపించరా అని ప్రశ్నించారు. ఎక్కడో ముంబాయికి పారిపోయి అక్కడి నుంచి మాట్లాడటం కాదు.. దమ్ముంటే కడపకు వచ్చి మాట్లాడాలని సవాల్‌ విసిరారు. తాను విజయవాడకు వచ్చి మాట్లాడుతున్నామని సూటిగా చెప్పారు. తన సినిమాల కోసమే అందర్నీ విలన్లుగా చూపిస్తున్నారని విమర్శించారు. గతంలో బెజవాడను రౌడీల కేంద్రంగా వర్మ చూపించారని, ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తే తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు.

డబ్బుల కోసమే ఎప్పుడో జరిగిన వాటిని చూపిస్తే మళ్లీ కక్షలు పెరిగే ప్రమాదం ఉందని, పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే కడప వెబ్‌సిరీస్‌ను నిలిపి వేయాలని కోరారు. రాయలసీమను ఫ్యాక్షన్ సీమగా చిత్రీకరించడం సరికాదన్నారు. రాంగోపాల్ వర్మ నిజంగానే తెలుగు గడ్డ పైనే పుట్టావా లేదా అనే సందేహం తలెత్తుందన్నారు. ఎదుటి వారి బాధను చూసి రాక్షస ఆనందాన్ని పొందే సైకో లాంటి వ్యక్తి రాంగోపాల్‌ వర్మ అని అన్నారు. రాయలసీమ చరిత్రను పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని, రాయలసీమ నుంచే రతనాల వంటి నేతలు రాజకీయాలలో రాణించారని.. రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు అయ్యారని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు