అడ్డగోలు పదోన్నతులజాతర!

30 Nov, 2013 06:05 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అసలు ఖాళీలు లేవు... ఆపై పోస్టులు కూడా లేవు... ఉన్న పోస్టుల సంఖ్య కంటే ఎక్కువ మందే పనిచేస్తున్నారు. కొత్తగా పోస్టులు ఇవ్వటానికి ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవు. కాని ఇవేమీ మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులకు అక్కర్లేదు. కావాల్సింది డబ్బులు ఒక్కటే.  పైరవీలు చేసే వారికి అగ్రప్రాధాన్యం ఇవ్వటం ఈ శాఖలో షరా మాములుగా మారింది. తాజాగా ఇదే రీతిలో ఖాళీలు లేని డిప్యూటీ డెరైక్టర్ పోస్టింగ్‌లు ఉన్నట్లు చూపి 40 మందికి పదోన్నతులు ఇవ్వటానికి కమిషనర్ లేని సమయంలో కొందరు ఉన్నతాధికారులు చకాచకా పావులు కదిపారు.

 పర్యవసానంగా భారీగా మార్కెటింగ్‌శాఖలో పదోన్నతుల జాతర జరగనుంది. సర్వీసు నిబంధనల ప్రకారం మార్కెట్‌యార్డుల్లో పదోన్నతులు, పోస్టింగ్‌ల విషయంలో 9ః1 నిష్పత్తి ప్రకారం జరగాలి. అంటే  పదోన్నతుల్లో 9మంది మార్కెట్‌కమిటీ ఉద్యోగులకు పదోన్నతి ఇస్తే మార్కెట్‌యార్డుల్లో పనిచేయటానికి 1 మార్కెటింగ్ శాఖ అధికారికి ఇస్తారు. కాని ప్రస్తుతం శాఖలో దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. ఫలితంగా వందల మంది మార్కెట్‌కమిటీ ఉద్యోగులు  పదోన్నతుల కోసం పోరు సాగించాల్సి వస్తోంది.
 ప్రస్తుతం రాష్ట్రంలో మార్కెటింగ్‌శాఖ డిప్యూటీ డైరైక్టర్(డిడి) పోస్టులు ఆరు మాత్రమే ఉన్నాయి. మూడు లేదా ఐదు జిల్లాలకు కలిపి ఒక రీజియన్‌గా గుర్తించి ఒక డిప్యూటీ డెరైక్టర్‌ను నియమిస్తారు. అలాగే రాష్ట్రంలో 57 మార్కెట్‌యార్డుల్లో ఉన్నతశ్రేణి కార్యదర్శులు ఉన్నారు. ఉన్నతశ్రేణి  కార్యదర్శిగా మార్కెట్ కమిటీ యార్డు సర్వీసులో పదోన్నతి పొందిన వారితో పాటు డిప్యూటీ ైడె రెక్టర్లు కూడా అర్హులే. అయితే అక్కడ 9ః1 నిష్పత్తిని అనుసరించి ఇవ్వాలి.

ఆ ప్రకారం 5 ఉన్నతశ్రేణి కార్యదర్శి పదవుల్లో డిప్యూటీ డైరైక్టర్లు పనిచేయవచ్చు. కాని ప్రసుత్తం రాష్ట్రంలో ఆరుగురు డిప్యూటీ డెరైక్టర్లతో పాటు డీడీ హోదాలో ఉండి మార్కెట్ యార్డుల్లో ఏడుగురు పనిచేస్తున్నారు. వీరు కాకుండా తాజాగా మరో 40 మంది అసిస్టెంట్ డెరైక్టర్లకు డిప్యూటీ డైరక్టర్లుగా పదోన్నతులు కల్పించనున్నారు. వాస్తవానికి ఖాళీలు లేకపోగా ఉన్న యార్డుల్లో నిష్పత్తికి మించి అదనంగా పనిచేస్తున్నారు. కాని మార్కెట్‌యార్డులను చూపి డీడీలుగా పదోన్నతులు కట్టబెట్టడానికి పెద్ద వ్యవహారమే నడిచింది. శాఖలో చక్రం తిప్పే ముఖ్య వ్యక్తి కమిషనర్ ప్రమేయం లేకుండానే తతంగం అంతా నడిపినట్లు తెలుస్తోంది.  ఒక్కొక్క పోస్టుకు లక్ష నుంచి రెండు లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.

దీనికి గాను రాష్ర్టంలోని అన్ని జిల్లాల నుంచి పదోన్నతులు ఇవ్వటానికి వీలుగా సమాచారాన్ని కమిషనర్ కార్యాలయానికి తెప్పించారు. ఖమ్మం జిల్లాలో ఒకరు, గుంటూరులో మూడు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు, విజయవాడ ఒకరు, విశాఖపట్నం నుంచి ఒకరు, కృష్ణా జిల్లా నుంచి ఒకరు అసిస్టెంట్ డెరైక్టర్ నుంచి డీడీలుగా పదోన్నతులు పొందే జాబితాలో ఉన్నారు. వీరు కాకుండా రాష్ర్టంలోని అన్ని జిల్లాల నుంచి ఏడీలు ఉన్నారు.
 ఏడీ పదోన్నతుల్లోనూ...
 మరోవైపు ఇదే రీతిలో సీనియర్ మార్కెటింగ్ అసిస్టెంట్ నుంచి అసిస్టెంట్ డెరైక్టర్లుగా పదోన్నతుల కోసం 52 మంది జాబితాతో ఫైల్ సిద్ధం చేశారు. వీటిలోనూ ఇదే తంతు కొనసాగుతుంది. రాష్ర్టవ్యాప్తంగా 30పోస్టులకు గాను పూర్తిస్థాయిలో అధికారులు ఉన్నారు. అలాగే ఏడీ స్థాయి అధికారి స్పెషల్‌గ్రేడ్ కార్యదర్శిగా మార్కెట్ యార్డుల్లో పనిచేసే అవకాశం ఉంది. అది కూడా సుమారు 12 మంది వరకు మాత్రమే పనిచేసే వీలుంటుంది. కాని ఇప్పటికే 37 మంది పనిచేస్తున్నారు. దీంతో నిత్యం మార్కెట్‌కమిటీ ఉద్యోగులు మార్కెటింగ్‌శాఖ ఉద్యోగుల మధ్య సమస్యలు ఉత్పన్నమై పదోన్నతుల కోసం మార్కెట్ కమిటీ ఉద్యోగులు నిత్యం ట్రిబ్యునల్‌ను, హైకోర్టును ఆశ్రయించి హక్కులు కాపాడుకుంటున్నారు. అసలు ఖాళీలు లేవు. కొత్తగా పదోన్నతులు ఇచ్చిన వారికి పోస్టింగ్‌లు మంజూరు చేయటం కష్టమని తెలిసికూడా కొందరు ఉన్నతాధికారులు కాసుల కోసమే తతంగం నడుపుతున్నారనే అరోపణలు ఉన్నాయి. సదరు శాఖ  అమాత్యుని పేరు చెప్పుకొని శాఖలో చెలామణి అవుతూ అమాత్యునికి తెలియకుండానే కొన్ని పనులు చక్కపెడుతున్నారు.
 కిందిస్థాయిలోనూ సమస్యలే....
 ఈవ్యవహారాలతో కిందిస్థాయిలో ఇబ్బందులు తలెత్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 358 పోస్టుల ఖాళీలు ఉన్నట్లు  2010లో నిర్ధా రించారు. ఇలాంటి అక్రమాలతో ఇవన్నీ మరుగున పడిపోతున్నాయి. తెలంగాణ రీజియన్‌లోని ఖమ్మం, వరంగల్, అదిలాబాద్, నల్గొండ, కరీంగనర్ జిల్లాలో 27 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 50 వరకు పదోన్నతులు కిందిస్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా గ్రేడ్-2, గ్రేడ్-3 కార్యదర్శుల పదోన్నతులు 11, సూపర్‌వైజర్ నుంచి అసిస్టెంట్ కార్యదర్శులు 38 మంది పదోన్నతులు నిలిచిపోయాయి. మార్కెట్ కమిటీ సర్వీసులోకి ఇబ్బడి ముబ్బడిగా మార్కెటింగ్‌శాఖ ఉద్యోగులు కొందరు పైరవీలతో వస్తుండటం వల్ల పదోన్నతులు సక్రమంగా జరగటం లేదు. పర్యవసానంగా మార్కెట్ యార్డులోనే పదోన్నతులు ప్రకియ పూర్తిగా గాడితప్పింది. ఖమ్మం జిల్లాలోని 13 మార్కెట్ కమిటీల్లో 130 మంది సిబ్బందికి గాను 60 మందే పనిచేయటం ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం.

మరిన్ని వార్తలు