కుక్క కాటుకు మందేది?

11 Dec, 2013 00:21 IST|Sakshi

సిద్దిపేట/సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్:  సిద్దిపేట అనగానే ఫుల్లుగా డెవలప్ అవుతున్నదంటారు. రానున్న రోజుల్లో మెడికల్ కాలేజీ రావొచ్చని ఆశిస్తున్నారు. అదేమో కానీ కుక్క కరిస్తే మాత్రం సర్కారీ సూది మందు (ఇమ్యూనోగ్లాబ్లిన్) దొరకదు. బాధితులు సిటీకి పరుగులు పెట్టాల్సిందే. ఈ మధ్య శునకాలు తరుచూ స్వైరవిహారం చేస్తున్నాయి. దుబ్బాక మండలం దుంపలపల్లిలో ఇటీవలే ఓ చిన్నారి సహా ముగ్గురు వ్యక్తులను కుక్క కరిచిన సంఘటన మరువకముందే మరోటి చోటుచేసుకుంది. ఈసారి సిద్దిపేట మండలం బుస్సాపూర్‌లో..  అభం శుభం తెలియని పసివాళ్లను శునకం కొరికేసింది.

సోమ, మంగళవారాల్లో వరుసగా రెండ్రోజులు ఆ కుక్క స్వైరవిహారం చేసి తీవ్రంగా గాయపర్చింది. కుక్కకాటుకు గురైన మద్దూరి పుష్పలత(10), సాజీద్(5), రాజు(7), మన్నే శశికుమార్(6), గిరి(9) అనే చిన్నారులు తల్లడిల్లారు. వారిలో కండలు తేలిన సాజీద్, రాజు, పుష్పలతలకు  కుటుంబీకులు హైదరాబాద్‌లోని నారాయణగూడ ఐపీఎం, ఫీవర్ ఆస్పత్రిల్లో చికిత్స చేయించారు.
 ఇక్కడున్నది యాంటీ రాబీస్ వ్యాక్సినే
 సిద్దిపేట ప్రాంతీయ వైద్యశాలలో యాంటీ రాబీస్ వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉంది. కుక్కలు మామూలుగా కరిస్తే ఈ సూది ఇస్తారు. అదే తీవ్రంగా గాయపరిస్తే మాత్రం కచ్చితంగా ఇమ్యూనోగ్లాబ్లిన్ అనే సూది ఇవ్వాల్సిందే. అదిక్కడ లేదు. ఒక్కోటి రూ.ఐదారు వేల విలువైనది కావడంవల్ల ఆ సదుపాయం ఏర్పాటు చేయలేదని వైద్యశాల వర్గాలంటున్నాయి. అందుకే అనివార్యంగా హైదరాబాద్‌కు పంపించాల్సి వస్తోందని తెలిపాయి.
 

మరిన్ని వార్తలు