ఉపాధి హామీలో అక్రమాలు

21 Nov, 2013 04:48 IST|Sakshi

 బిచ్కుంద, న్యూస్‌లైన్:  మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో జరిగిన ఉపాధి హామీ పనులపై బుధవారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో ఈజీఎస్, ఐకేపీ సిబ్బంది చేతి వాటం బహిర్గతమైంది.  కూలీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, ఐకేపీ సిబ్బం ది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించకుండా ఆయా గ్రామాలలో అడుగడుగునా అవినీతికి పాల్పడినట్లు బహిర్గతమైంది. మండలంలో 2013-14కుగాను రూ 3 కోట్ల 70 లక్షల పనులు జరిగాయి. సామాజిక తనిఖీ బృందం ఒక్కొక్కరి అక్రమాలు బయటకు తీసింది. పెద్ద దడ్గి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ కూలీలతో పనులు చేయించకుండా యంత్రాలతో చేయించారని తనిఖీ బృందం గుర్తించింది.

ఆయా గ్రామాలలో కూలీలకు కూలి డబ్బులు రాలేదని, కందకాలు, కాలువల పనులు చేయకుండానే పను లు చేసినట్లు రికార్డులు చూపించడం, మంజూరు లేని పనులు చేసి డబ్బులు కాజేయడం తదితర అవినీతికి పాల్పడ్డారు. చిన్న దేవాడలో సహదేవ్ పేరుతో విద్యార్థి లేకపోయినా ఐకేపీ సిబ్బంది స్కాలర్‌షిప్ రూ 2,400 డ్రా చేసుకున్నారు. అలాగే గుండెకల్లార్‌లో దమ్ముల శీలా విద్యార్ధి పేరుతో రూ 1,200, వడ్లం గ్రామంలో జ్యోతి, సుజాత, శివరాం, భూమయ్య, సవిత విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ 1,200  స్కాలర్‌షిప్ అందలేదు. ఫోర్జరీ సంతకాలు చేసి ఐకేపీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని సామాజిక తనిఖీ బృందం గుర్తించింది. కూలిడబ్బు లు, స్కాలర్‌షిప్ డబ్బులు తమకు అందలేదని వి ద్యార్థులు, కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పూర్తి విచారణ చేపట్టి అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని, అందని వారికి డబ్బులు అందిస్తామని ఏపీడీ కుమార స్వామి హామీ ఇవ్వడంతో  ప్రజలు శాంతించారు.  కార్యక్రమంలో సోషల్ ఆడిట్ అధికారి భూమేష్, ఏపీవో రాజు, ఈయా గ్రామల సర్పంచులు, కూలీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు