ఆరంభించని ఇందిరమ్మ ఇళ్లు.. రద్దు!

4 Jul, 2014 04:35 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నిర్మాణం మొదలైన ఇళ్లు సగంలోనే ఆగిపోయాయి.  నిధులకు బ్రేకులు పడ్డాయి. మరోవంక... నిర్మాణం మొదలుకాని ఇళ్లకు మంగ ళం పాడేయటానికి కూడా రెడీ అయిపోయారు. ఇదీ... ఇందిరమ్మ ఇళ్ల దుస్థితి. ఎన్నికలు... ప్రభుత్వం మారటం వంటి కారణాలతో మార్చి నుంచి లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులన్నీ నిలిపేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ.363.66 కోట్ల విడుదల ఆగిపోయింది.
 
 పులిమీద పుట్రలా 2011కు ముందు మంజూరై ఇప్పటి దాకా ప్రారంభించని ఇళ్లను రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పిడుగు పాటే. రాష్ట్రంలో 2011 మార్చికి ముందు మంజూరై ఇప్పటి దాకా నిర్మాణం ప్రారంభం కాని పక్కా ఇళ్లు ఎన్ని ఉన్నాయో గుర్తించి నివేదికలు పంపాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అంతా వివరాలు తెప్పించుకునే పనిలో పడ్డారు. జిల్లాల నుంచి నివేదికలు అందిన వెంటనే ప్రభుత్వం రద్దు నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు