ఇడుపులపాయలో కుటుంబసభ్యులు, నేతల నివాళి

3 Sep, 2013 04:35 IST|Sakshi

 సాక్షి, కడప : దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాల్గవ వర్ధంతి కార్యక్రమాలు జిల్లాలో ఘనంగా జరిగాయి. వాడవాడలా  సేవాకార్యక్రమాలను నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడంతోపాటు సాంసృ్కతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి పనులను మననం చేసుకున్నారు.  ఇడుపులపాయలో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్, వైవీ సుబ్బారెడ్డితోపాటు కుటుంబ సభ్యులు ఉదయాన్నే ఘాట్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ ఉద్వేగానికి గురై కంటతడి పెట్టారు. దీంతో కుమార్తె షర్మిల ఆమెను సముదాయించారు. అనంతరం షర్మల సమైక్య శంఖారావం యాత్రలో పాల్గొనేందుకు తిరుపతి వెళ్లారు.   పులివెందులలోని చిన్న రంగాపురం, నల్లపురెడ్డిపల్లెలో వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.
 
  జమ్మలమడుగు పట్టణంలోని పాత బస్టాండులో  వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు.  ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, అల్లె ప్రభావతి, హనుమంతరెడ్డి ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.  ఎర్రగుంట్లలో వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మైలవరం మండలం దన్నవాడ గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి అల్లె చెన్నారెడ్డి పాలాభిషేకం చేశారు.
 
  ప్రొద్దుటూరులో వైఎస్సార్ వర్ధంతి సందర్బంగా  భారీ ర్యాలీ నిర్వహించారు. బండెద్దుల ప్రదర్శన,చెక్కభజనలతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. పుట్టపర్తి సర్కిల్‌లో వంటా వార్పు  నిర్వహించారు. అన్వర్‌థియేటర్‌వద్ద  ఉన్న  వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది. వైఎస్సార్ సీపీ నేతలు ఈవీ సుధాకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, నాగేంద్రరెడ్డి  పాల్గొన్నారు.
 
  బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్లలో  వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు.  బస్టాండు ప్రాంతంలో వంటా వార్పు నిర్వహించి అన్నదానం నిర్వహించారు. నియోజకవర్గంలోని వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఈకార్యక్రమాల్లో  మాజీ మున్సిపల్ చైర్మన్ మునెయ్య, వైస్ చైర్మన్ గురుమోహన్, వైఎస్సార్ సీపీ నేతలు విశ్వనాథరెడ్డి, ప్రభాకరరెడ్డి, కరెంటు రమణారెడ్డి, నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
  రాయచోటిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్‌చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బస్టాండులోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు జాఫర్, జనార్ధన్‌రెడ్డి, అయ్యవారురెడ్డి  పాల్గొన్నారు.
 
  కడప నగరంలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద వైఎస్ విగ్రహానికి జిల్లాకన్వీనర్ కె.సురేష్‌బాబు, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్‌బాష  పాలాభిషేకం చేశారు. అక్కడే వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టి పేదలకు అన్నదానం  చేశారు. అనాథ శరణాలయాలు, ఆస్పత్రుల్లో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి  అన్నదానంతోపాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
 
  కమలాపురంలో ఎన్‌సీ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ సమన్వయకర్తలు మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి  ప్రారంభించారు. పార్టీ జిల్లా కోశాదికారి సుధా కొండారెడ్డి నేతృత్వంలో రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. నేతలు ఉత్తమారెడ్డి, రాజుపాలెం సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
 
  మైదుకూరులో మదీనా దస్తగిరి ఆధ్వర్యంలో  రోగులకు, వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మంగారిమఠంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కూడలిలో వంటా వార్పు చేపట్టారు. . సాంసృ్కతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలలో  నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.రఘురామిరెడ్డి, కన్వీనర్ పెంచలయ్య, కొండారెడ్డి, వీరనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
  రైల్వేకోడూరులోని  వైఎస్ అతిథి గృహంలో వైఎస్  చిత్రపటానికి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ అద్యక్షుడు కొల్లం బ్రహ్మందనరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజలకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు.
 
  రాజంపేటలో వైఎస్సార్ విగ్రహానికి పాలాబిషేకం చేశారు. చొప్పావారిపల్లెలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి నివాళులర్పించారు. ఆకేపాడు పీహెచ్‌సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలా శ్రీనివాసులురెడ్డి, ఆకేపాటి మురళీరెడ్డి, చొప్పాయల్లారెడ్డి  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు