ఏపీలో పెరిగిన కరోనా వైద్య పరీక్షలు

30 Apr, 2020 19:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: గత కొన్ని రోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం దూసుకువెళుతోంది. వివిధ రాష్ట్రాల్లో జరిగిన నిర్ధారణ టెస్ట్‌ల గణాంకాలు చూస్తే దేశంలోనే అత్యధిక కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలుస్తోంది. ఏపీలో కరోనా టెస్ట్‌ల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోంది. మిలియన్‌కు 1771 చొప్పున వైద్య పరీక్షలు చేస్తున్నారు. మిలియన్ కు 1400 పరీక్షలతో తమిళనాడు రెండవ స్థానం ఉండగా.. మిలియన్‌కు 1200 పరీక్షలతో రాజస్థాన్‌ 3వస్థానంలో ఉంది. ఏపీలో ఇప్పటివరకు 94వేల 558 పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 1403 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
(సమర్థవంతంగా టెలి మెడిసిన్)

ఏపీలో కరోనా పాజిటివ్‌ రేటు 1.48 శాతంగా ఉండగా.. కరోనా మరణాల రేటు 2.21 శాతంగా ఉంది. గత ఐదు రోజులుగా ఏపీలో కరోనా మరణాలు సంభవించలేదు.. కరోనా వైరస్‌ నుంచి కోలుకుని ఇప్పటివరకు ఏపీలో 321 డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో 9 వైరాలజీ ల్యాబొరేటరీలు ఉన్నాయి.. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరుల్లో కొత్త ల్యాబొరేటరీలు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా వైరస్‌ వచ్చే నాటికి మన రాష్ట్రంలో కేవలం 90 టెస్టులు మాత్రమే చేసే సామర్థ్యమే ఉండగా.. ఇప్పుడు 7500 టెస్టులు చేసే స్థాయికి ఏపీ చేరింది. 240 ట్రూనాట్‌ మెషీన్ల ద్వారా టెస్టులు చేస్తున్నారు. మరో 100 మెషీన్లు కొనుగోలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
(ఏపీలో కొత్తగా 71 కరోనా కేసులు)

మరిన్ని వార్తలు