కరోనా కాలంలోనూ ‘క్షీర ధార’

4 May, 2020 04:05 IST|Sakshi

తగ్గని పాల సేకరణ.. వినియోగం

టీ స్టాల్స్‌ మూతపడినా ఇళ్లల్లో పెరిగిన పాల వాడకం

పాడి రైతులకు బోనస్‌

సాగు విస్తీర్ణం పెరగడంతో గడ్డి కొరత లేదు

‘సాక్షి’తో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ సమయంలోనూ పశు సంపదకు వచ్చిన ఇబ్బందేమీ లేదు.  మేపు మొదలు పాల ఉత్పత్తుల వరకు వేటికీ కొరత ఏర్పడలేదు. పైగా ఈ సమయంలో పాడి పరిశ్రమ వ్యవస్థీకృతమైంది. మార్కెట్‌ స్థిరీకరణకు తోడ్పడింది’ అని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ‘సాక్షి తో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ తొలి నాళ్లలో పౌల్ట్రీ పరిశ్రమ కొంత ఇబ్బంది పడినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేద న్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...

► గత ఏడాదితో పోలిస్తే పాల సేకరణ ధర పెరిగింది. గత ఏడాది 10 శాతం వెన్న ఉన్న గేదె పాలు లీటర్‌ రూ.56 ఉంటే.. ఇప్పడు రూ.63 అయ్యింది. పాల సేకరణ కూడా పెరిగింది. 
► టీ స్టాల్స్‌ మూత పడటంతో పాల వినియోగం తగ్గిన మాట వాస్తవమే. కానీ.. గతంలో బయట టీ సేవించే వారంతా ఇప్పుడు ఇళ్లల్లోనే ఒకటికి రెండుసార్లు తాగుతు న్నారు. అందువల్లే ఇళ్లల్లో పాల వినియోగం పెరిగింది.
► ఎప్పటిలానే లాక్‌డౌన్‌ వేళ కూడా 48 లక్షల నుంచి 50 లక్షల లీటర్ల పాలను డెయి రీలు సేకరిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో డెయిరీలు రైతులకు బోనస్‌  చెల్లించాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, హోటళ్లు లేకపోవడంతో బల్క్‌ కర్డ్‌ (పెరుగు బకెట్లు) విని యో గం తగ్గినా.. రిటైల్‌ విని యోగం బాగా పెరిగింది. 
► వేసవి కనుక సహజంగానే పచ్చిగడ్డి తక్కువగా ఉం టుంది. ఎండు మేతకు, దాణాకు కొరత లేదు. ఈ ఏడాది రబీలో వాతావరణం అనుకూలించి రికార్డు స్థాయిలో పంటలు సాగవటంతో ఎండుగడ్డికి ఇబ్బంది లేదు.
► లాక్‌డౌన్‌ సాకుతో పశువుల మేతను ఎక్కువ రేట్లకు అమ్మితే చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉంటే కాల్‌ సెంటర్‌ నంబర్‌ 1962కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి.
► డెయిరీలు, డెయిరీ సంబంధిత కర్మాగారాల్లో ఏవైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు జాయింట్‌ కలెక్టర్‌ నాయకత్వంలో కమిటీలు ప్రతి జిల్లాలో చురుగ్గా పని చేస్తున్నాయి. 
► వేసవి తీవ్రమవుతున్నందున వడగాడ్పుల నుంచి పశువులను రక్షించుకునేందుకు చర్యలు చేపట్టాలి. నీడ పట్టున ఉంచే మార్గాలు చూడాలి.
► ఎండ నుంచి వచ్చిన పశువుల్ని చన్నీటితో కడిగితే పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది.

మరిన్ని వార్తలు