నూనె.. వాడకం పెరిగెనే

19 Sep, 2018 12:06 IST|Sakshi

ఐదేళ్లలో గణనీయంగా పెరిగిన నూనెల వినియోగం

సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ది మొదటి స్థానం

 తగ్గిన పామాయిల్‌ వాడకం

తాడేపల్లిగూడెం: గతంతో పోలిస్తే వంటనూనె వినియోగం బాగా పెరిగింది. అర్జెంటీనా, బ్రెజిల్‌ నుంచి సోయాబిన్, మలేషియా, ఇండోనేషియా నుంచి పామాయిల్‌ దిగుమతులు పెరగడం కూ డా నూనె వినియోగం పెరగడానికి కారణాలుగా ఉన్నాయి. గతంలో ఒక కుటుంబం నూనె విని యోగం నెలకు రెండు కిలోలు ఉంటే ప్రస్తుతం నాలుగు నుంచి ఐదు కిలోలకు చేరింది. పామాయిల్‌ వాడకాన్ని గత ఐదేళ్లలో వినియోగదారులు 30 శాతం వరకు తగ్గించారు. ఆ స్థానంలో సన్‌ఫ్లవర్‌ వినియోగం పెరిగింది. పామాయిల్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోవడం, సన్‌ఫ్లవర్‌లో కొవ్వు శాతం ఉండదనే భా వంతో దీని వినియోగం పెరిగినట్టు తెలుస్తోంది. 

వాడకం పెరిగిందిలా..
వంట నూనెల వినియోగం గత 18 ఏళ్ల కాలంతో చూసుకుంటే భారీగా పెరిగింది. సగటున పెరుగుదల 30 శాతం వరకు ఉంది. దేశంలో వంట నూ నెల వినియోగం 2000లో 175.6 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా 2013 320.87 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరింది. 2018 నాటికి దీనికి మరో 30 శాతం పెరిగినట్టు అంచనా. వినియోగదారుల అవసరాలకు సరిపడా నూనెలను, నూనె గిం జలను ఉత్పత్తి చేసే అవకాశం దేశంలో లేదు. దీంతో మొత్తం డిమాండ్‌లో 48.10 శాతం నూనెలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచంలోనే అత్యధికంగా నూనెలను దిగుమతి చేసుకునే  ప్రధాన మూడు దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉంది. 

నూనెలను మారుస్తున్నారు 
పూర్వం మాదిరిగా ఒకే నూనెను వాడే అలవాటులో ఇటీవల మార్పు వచ్చింది. సన్‌ఫ్లవర్‌ వాడితే కొవ్వు ఉండదు, ఆరోగ్యానికి మంచిదనే భావన చాలా మందిలో వచ్చింది. దీంతో పామాయిల్‌ బదులు సన్‌ఫ్లవర్, సన్‌ఫ్లవర్‌ బదులు వేరుశనగ, వేరుశనగకు బదులు తవుడు నూనెలను చాలా మంది వాడుతున్నారు. పామాయిల్‌ వినియోగం 25 శాతం తగ్గి, ఆస్థానంలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ వినియోగం పెరిగింది. అదీకాకుండా ప్రజల ఆహారపు అలవాట్లలో ఇటీవల పెనుమార్పు వచ్చింది. నూనె వస్తువులను ఎక్కువగా ఇష్టపడటంతో వినియోగం పెరిగినట్టు తెలుస్తోంది. 

దేశంలో నిల్వలు ఇలా..
దేశంలోని వివిధ పోర్టుల్లో ఈనెల 11 నాటికి నూ నెల నిల్వలు ఇలా ఉన్నాయి. పామాయిల్‌ 1,03,739 టన్నులు, క్రూడ్‌ పామాయిల్‌ (సీపీఓ) 2,03,506 టన్నులు, సోయా 1,51,779 టన్నులు, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ 2,21,206 టన్నులు, కెనో లా ఆయిల్‌ 7,458 టన్నులు, ఇతర రకాల నూనెలు 15,659 టన్నులు మొత్తంగా 7,09,350 టన్నులు. 

కాకినాడ పోర్టులో..
రాష్ట్రంలో వ్యాపారులు, రిఫైనరీల యజమానులు రాష్ట్ర అవసరాల నిమిత్తం కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా నూనెలు దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లా వ్యాపారులు కాకినాడ పోర్టు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈనెల 11 నాటికి కాకినాడ పోర్టులో నూనెల నిల్వలు ఇలా ఉన్నా యి. పామ్‌ కెర్నోల్‌ (పామాయిల్‌ పిక్కల నుంచి తీసిన నూనె) 700 టన్నులు, రిఫైన్డ్‌ బ్లీచ్డ్‌ పామాయిల్‌ (ఆర్‌బీడీ) 4,165 టన్నులు, సీపీఎస్‌ 4,682 టన్నులు, పామ్‌ క్రూడ్‌ 24,335 టన్నులు, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ 51,680 మెట్రిక్‌ టన్నుల నిల్వలు ఉన్నాయి. 

జిల్లాలో నెలకు 5 వేల టన్నులు
జిల్లా జనాభా సుమారు 40 లక్షలు ఉండగా సుమారు 10 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఒ క్కో కుటుంబానికి నెలకు ఐదు కిలోల వం తు న నూనె వాడుతుంటే వినియోగం 50 లక్షల కి లోలు ఉంటుంది. ఈ లెక్కన 5,000 టన్నుల నూనెను జిల్లా ప్రజలు నెలకు వినియోగిస్తున్నారన్నమాట.

మార్చి వాడటం మేలు
ఒక్కో మనిషి సగటున నెలకు అరకిలో నూనె వాడుతున్నారు. నూనెలు వాడటం వల్ల కొవ్వు ఏర్పడుతుందనే భావన సరికాదు. శరీరంలో సహజంగానే కొవ్వు ఏర్పడుతుంది. ఒకే నూనె వాడకుండా మూడు నెలలకు ఒకసారి నూనెల రకాన్ని మార్చడం శ్రేయస్కరం. సన్‌ఫ్లవర్, రైస్‌బ్రాన్‌ ఆయిల్, వేరుశనగనూనె వంటివి 90 రోజులకు ఒకసారి మార్చి వినియోగించడం ఆరోగ్యరీత్యా మేలు. 
– డాక్టర్‌ నార్ని భవాజీ, తాడేపల్లిగూడెం

30 శాతం వరకు పెరిగింది
గతంలో కంటే నూనెలను మార్చి మార్చి వినియోగదారులు వాడుతున్నారు. సన్‌ఫ్లవర్‌లో కొవ్వుశాతం ఉండదు. వేరుశనగలో అన్నీ ఉంటాయి. రైస్‌బ్రాన్‌ ఆయిల్‌లో పోషకాలు ఉంటాయి. నూనెల వినియోగం ఐదేళ్లలో 30 శాతం వరకు పెరిగింది. పామాయిల్‌కు ప్రత్యామ్నాయంగా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను వాడుతున్నారు. 
– గమిని సుబ్బారావు, నూనె వ్యాపారి, తాడేపల్లిగూడెం

పామాయిల్‌ తగ్గించాం
గతంలో కంటే నూనె వాడకం పెరిగింది. ప్రస్తుతం అన్నిరకాలు వినియోగిస్తున్నాం. సన్‌ఫ్లవర్‌ ఎక్కువగా వాడుతున్నాం. పామాయిల్‌ వాడకం తగ్గిం చాం. అల్పాహారం, ఇతర వంటకాల కోసం నూనె వినియోగం పెరగడంతో నెలకు రెండు కిలోలకు బదులు మూడు కిలోల వరకు నూనె ఖర్చవుతోంది.
– కర్రి పార్వతి, గృహిణి, పెంటపాడు 

మరిన్ని వార్తలు