సాక్షి, మచిలీపట్నం : సార్వత్రిక సమరం కీలక దశకు చేరుకుంది. పోరులో పైచేయి సాధించేందుకు ప్రధాన పార్టీలు ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. ప్రధాన పార్టీల మధ్యే పోరు సాగుతున్నా, బరిలో మాత్రం సగానికిపైగా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జిల్లాలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు.. తాము ఏ విషయంలో తగ్గేది లేదన్నట్టుగా.. ముందుకెళుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఏమాత్రం తగ్గని రీతిలో.. ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం వీరు చీల్చే ఓట్ల ప్రభావం ఎవరిపై పడుతుందోననే ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది.
జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలకు 27 మంది, 16 అసెంబ్లీ స్థానాలకు 205 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో సింహభాగం ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులే ఉన్నారు. వీరిలో ఇతర పార్టీల అభ్యర్థులు, టీడీపీ నాయకులు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బదీసేందుకు స్వతంత్రులను రంగంలోకి దించారన్న ప్రచారమూ సాగుతోంది.
బందరు, అవనిగడ్డ, ఇలా అన్ని ప్రధాన నియోజకవర్గాల్లో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, జనసేనతో పాటు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలకు చెందిన నలుగురు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు 1000 నుంచి 10,000 ఓట్ల వరకు చీల్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కొత్త చిక్కు..
2014 ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్ సీపీ మధ్య పోరు సాగింది. ప్రస్తుతం రంగంలోకి జనసేన రావడంతో ఏ పార్టీ ఓట్లు చీల్చుతుంది? మూడో పార్టీ రంగ ప్రవేశంతో ఏ పార్టీకి నష్టం కలుగుతుందన్న చర్చ నడుస్తున్న తరుణంలో స్వతంత్రుల పోరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు మరో చిక్కు తెచ్చిపెట్టినట్లయింది. చీల్చేవి తక్కువ ఓట్లయినా రసవత్తర యుద్ధంలో కొన్సిసార్లు అవే కీలకంగా మారే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు ఈ అంశంపై తర్జనభర్జన పడుతున్నాయి.
పార్లమెంట్ల పరిధిలో..
అసెంబ్లీ పరిధిలో..