స్వతంత్రులకు పట్టం కట్టని కొత్తపేట
సాక్షి, కొత్తపేట (తూర్పు గోదావరి): జిల్లాలో కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు స్వతంత్ర అభ్యర్థులకు ఎప్పుడూ పట్టం కట్టలేదు. అయితే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో నువ్వా.. నేనా..? అనే రీతిలో తలపడి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. ఇక్కడ ఆది నుంచీ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పలువురు ఎన్నికల బరిలో నిలిచినా ప్రధానంగా ముత్యాల సుబ్బారాయుడు మాస్టారు (కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల రిటైర్డ్ హెచ్ఎం), ఎంవీఎస్ సుబ్బరాజు, డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి స్వతంత్రంగా పోటీ చేసి ఓటమిపాలైనా తమ సత్తా చాటుకున్నారు.
1962, 1967 ఎన్నికల్లో వరుసగా ముత్యాల సుబ్బారాయుడు మాస్టారు (కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల రిటైర్డ్ హెచ్ఎం) కాంగ్రెస్ అభ్యర్థి ఎంవీఎస్ సుబ్బరాజుకు గట్టి పోటీ ఇచ్చి కేవలం 1,542 ఓట్లు, 3,143 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 1972లో ఎంవీఎస్ సుబ్బరాజు కాంగ్రెస్ అభ్యర్థి భానుతిలకంతో తలపడి 9,829 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి 1985, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు డాక్టర్ ఐఎస్ రాజు, బండారు సత్యానందరావులతో తలపడి 1,397, 16,113 ఓట్ల తేడాతో ప్రత్యర్థిగా నిలిచి తన సత్తా చాటుకున్నారు. అలా ఈ నియోజకవర్గం ప్రజలు ఎప్పుడూ రాజకీయ పార్టీలకే పట్టం కట్టారు.