వైఎస్‌ఆర్ స్టేడియంలో భారత్-ఎ, న్యూజిలాండ్-ఎ మ్యాచ్

8 Sep, 2013 00:45 IST|Sakshi

విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విశాఖ వేదికగా మరో అంతర్జాతీయ సిరీస్‌కు ఆదివారం నుంచి తెరలేవనుంది. వైఎస్‌ఆర్ స్టేడియంలో గతంలో ఇంగ్లాండ్ జట్టుతో భారత మహిళా జాతీయ జట్టు సిరీస్ ఆడింది. పురుషుల విభాగంలో క్వాడ్రేంగులర్ సిరీస్‌లో నాలుగు దేశాల అండర్ 19 క్రికెట్‌కు ఆతిథ్య మిచ్చిన విశాఖలో ఈసారి న్యూజిలాండ్-ఎతో భారత్-ఎ జట్టు అనధికార సిరీస్ ఆడనుంది.  

జాతీయ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న ఇరుజట్ల ఆటగాళ్ళు ఆదివారం నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో రాణించేందుకు వేదికగా మారనుంది. ఇక్కడ ఆడిన రెండు అనధికార టెస్ట్‌ల ఫలితం తేలకుండానే డ్రాగా ముగిశాయి. అయితే భారత్-ఎకు నాయకత్వం వహించిన అభిషేక్ నాయర్ వన్డేల్లో స్థానం కోల్పోగా, న్యూజిలాండ్-ఎ కెప్టెన్ లాథమ్ వన్డేల్లో వికె ట్ కీపర్‌గానే ఉండనున్నాడు. ఇదిలా వుండగా వన్డే సిరీస్‌కు ఎంపికైన ఇరుజట్లు వైఎస్‌ఆర్ స్టేడియం బి గ్రౌండ్‌లో శనివారం ముమ్మరంగా సాధన చేశాయి.
 
 ఉన్ముక్త్, ఆండ్రూ కెప్టెన్లు
 టెస్ట్ సిరీస్ ఆడిన ఇరు జట్లలోనూ వన్డే సిరీస్‌కు మార్పులు చోటు చేసుకున్నాయి. వన్డే సిరీస్‌లకు కెప్టెన్లను మార్పు చేశారు. ఏకంగా భారత్ తరఫున నలుగురు మినహా జట్టులో మార్పులు చేయగా, న్యూజిలాండ్‌కు మూడే మార్పులు చేశారు.
 
 న్యూజిలాండ్-ఎకు లాథమ్ స్థానంలో ఆండ్రూ ఎల్లీస్, భారత్-ఎకు అభిషేక్ స్థానంలో ఉన్ముక్త్‌చంద్ నాయకత్వం వహించనున్నారు.  భారత్-ఎ తరఫున వన్డేలు ఆడేందుకు శ్రీకాంత్‌వా, జలజ్ సక్సేనా, దావల్ కులకర్ణి అవకాశం సాధించగా మిగిలిన జట్టును మార్చారు. ఇక న్యూజిలాండ్-ఎలో బ్రూమ్, బూర్డర్, నీషమ్ స్థానాల్లో కొలిన్, స్కాట్లను తీసుకున్నారు. ఆది, మంగళ, గురువారాల్లో వన్డేలు ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.
 
 విజయపథాన నడిపిస్తా
 విశాఖ వేదికగా చక్కటి ఇన్నింగ్స్ ఆడిన అనుభవం ఉంది. గడిచిన రెండు టెస్ట్‌ల్లో రాణించలేక పోయాను.  ఇప్పుడు ఆడబోయేది వన్డేలు. దానికి తగ్గట్టుగానే ఆటను మార్పు చేసుకుంటా. ఇక్కడే నాలుగు దేశాల అండర్19 క్రికె ట్‌లో సెంచరీ చేశాను. జాతీయ జట్టులో స్థానం సాధించేందుకు ఈ వన్డే సిరీస్ నాతో పాటు మరికొందరికి అవకాశం కానుంది.
 - భారత్-ఎ జట్టు కెప్టెన్ ఉన్ముక్త్‌చంద్
 

మరిన్ని వార్తలు