రట్టుకానున్న ఇంటిగుట్టు?

6 Nov, 2015 01:27 IST|Sakshi

విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అవినీతి చోటు చేసుకుందని తేల్చిన యంత్రాంగం ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. ఇందుకోసం విచారణాధికారిగా అజయ్ కల్లం ను నియమిం చారు. జిల్లాలో గతంలో నిర్మించిన గృహ నిర్మాణాల్లో ఒక్కొక్కరికీ రెండేసి , మూడేసి ఇళ్ల చొప్పున మంజూరు చేశారని అధికారులు తేల్చారు. జియోట్యాగింగ్ నేపథ్యంలో ఈ అక్రమాలు బయటపడినట్లు నివేదించారు. సుమారు రూ.45 కోట్ల అక్రమాలు జరిగినట్టు నివేదికలు రూపొందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. అయితే ఇప్పుడు దీనిపై విచారణాధికారిగా అజయ్ కల్లంను ప్రభు త్వం నియమించడంతో సర్వత్రా ఆసక్తి రేగుతోంది.
 
 అక్రమాలతో పాటు తప్పులు : వాస్తవానికి జిల్లాలో జియోట్యాగింగ్ కార్యక్రమంతోపాటు ఆధార్ అనుసంధానం వంటివి అధికారుల నిర్లక్ష్యంతో సక్రమంగా చేపట్టలేదని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా గతంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాల్లో ఆధార్ అనుసంధానం ప్రక్రియలో ఒకరి పేరున రెండు మూడేసి పేర్లను నమోదు చేశారని ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. 20 సూత్రాల అమలు కమిటీ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. దీనిపై  అక్రమాల కన్నా తప్పులెక్కువగా చోటు చేసుకున్నట్టు భావిస్తున్నారు. అవినీతి జరిగి ఉంటుంది కానీ అందులో తప్పులు కూడా జరిగాయని అంటున్నారు. ఏమైనా జిల్లాలో గృహ నిర్మాణ శాఖ పరంగా జరిగిన అవినీతిపై విచారణ జరిగితే ఎంతమందిపై ఆర్‌ఆర్ యాక్టు ప్రయోగించి నిధులను వెనక్కు తీసుకుంటారోనన్న విషయం మరికొద్ది రోజుల్లో బయటపడనుంది.
 

మరిన్ని వార్తలు