ఇండస్ట్రియల్ కారిడార్‌కు రైతులు సహకరించాలి

31 Mar, 2016 04:08 IST|Sakshi
ఇండస్ట్రియల్ కారిడార్‌కు రైతులు సహకరించాలి

ఆర్డీవో సూర్యారావు
 
నక్కపల్లి:  ఇండస్ట్రియల్ కారిడార్‌కు రైతులు సహకరిస్తే పనులు వేగవంతం చేస్తామని నర్సీపట్నం ఆర్డీవో కె.సూర్యారావు కోరారు. బుధవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో నలుగురు డిప్యూటీ కలెక్టర్లతో కలిసి సమావేశం అయ్యారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. నక్కపల్లి మండలంలో వేంపాడు, రాజయ్యపేట, అమలాపురం, డీఎల్‌పురం, బుచ్చిరాజుపేట, చందనాడ ప్రాంతాల్లో  రెండు విడతలుగా సుమారు 6 వేల ఎకరాలు భూసేకరణ జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్పారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినందున భూముల సర్వేకు ఐదు బృందాలు నియమించామని చెప్పారు. గ్రామాల్లో బుధవారం నుంచి సర్వే ప్రారంభమవుతుందని తెలిపారు.

ప్రభుత్వ, జిరాయితీ భూముల సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. సర్వే పూర్తయితే నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు సమగ్ర వివరాలు సర్వే బృందాలకు అందజేయాలని కోరారు. డిప్యూటీ కలెక్టర్లు గోవిందరాజులు, వి.రమణ,సత్తిబాబు, సుబ్రమణ్యం,సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు