నిర్లక్ష్యానికి మూల్యం తప్పదు

8 Aug, 2019 08:48 IST|Sakshi
బొబ్బిలిలోని పారిశ్రామిక వాడ గ్రోత్‌ సెంటర్‌

పారిశ్రామిక వేత్తలకు ఏపీఐఐసీ షాక్‌

నోటీసులు ఇచ్చినా వెరవని వారిపై యూనిలేట్రల్‌ కాన్సిలేషన్‌

బొబ్బిలిలో ఖాళీగా 30 ఎకరాల పరిశ్రమల స్థలం

సాక్షి, బొబ్బిలి: గత ప్రభుత్వంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుని అండతో బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో కంపెనీ పెడతామని ఇద్దరు వ్యక్తులు స్థలం తీసుకున్నారు. వీరు ఇక్కడ డీడ్‌ అగ్రిమెంట్‌ కూడా కుదుర్చుకున్నారు. పరిశ్రమ ఎందుకు స్థాపించడం లేదని అధికారులు పలుమార్లు నోటీసులు ఇస్తే అదిగో ఇదిగో అంటూ సంవత్సరాల తరబడి అధికారులకు చెబుతూ వచ్చారు. కనీసం ఏదైనా అనుమతుల కోసం దరఖాస్తు చేశామనో.. లేక ప్రొగ్రెస్‌లో ఉందనో.. చెప్పకుండా మిన్నకున్నారు.

ఇటువంటి వారు జిల్లా వ్యాప్తంగా 35 మందికి పైగానే ఉన్నారు. వీరి పేరున కోట్ల విలువైన పారిశ్రామిక వాడల్లో స్థలాలున్నాయి. వీరు నిర్మించరు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవకాశం ఇవ్వరు. ఏటా నోటీసులు అందుకోవడం.. పక్కన పడేయడం వీరి నైజం. కేవలం వీరే కాదు బడా పారిశ్రామిక వేత్తలు సైతం ఇదే పని చేస్తున్నారు. మరో పక్క జిల్లాలో ఉద్యోగ ఉపాధి పనులు లేక వలసలు పోతున్నా కోట్ల విలువైన స్థలాలు మాత్రం వదలడానికి ఇష్టపడటం లేదు.

గ్రోత్‌ సెంటర్‌లో పరిశ్రమల కోసం సేకరించిన స్థలం 1149 ఎకరాలు
అభివృద్ధి చేసిన ప్లాట్లు 388(876.58ఎకరాలు)
మొత్తం యూనిట్లు 310
పనిచేస్తున్న యూనిట్లు 137(అధికారికంగా చెబుతున్నవి)
వాస్తవ యూనిట్లు 35లోపే
ఉపాధి పొందుతున్న వారు 3వేల మంది లోపే
ఉపాధి లక్ష్యం 10,895 మంది
ముఖం చాటేస్తున్న పారిశ్రామిక వేత్తలు సుమారు  25 మంది

కొద్దిపాటి మొత్తానికే విలువైన మౌలిక సదుపాయాలు
కొద్ది శాతం ఫీజుతోనే రూ. కోట్ల విలువైన రోడ్లు, నీటి సదుపాయం, విద్యుత్‌ సౌకర్యాలు ఏర్పాటు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని అందిస్తే వాటిని ఆక్రమించుకుని ఏళ్ల తరబడి పరిశ్రమలు ఏర్పాటుచేయని యాజమాన్యాలకు పరిశ్రమల శాఖ షాక్‌ ఇవ్వనుంది. 30 సంవత్సరాలుగా జిల్లాలోని నాలుగు పారిశ్రామిక వాడల్లో స్థలాలను అప్పగించండంటూ నోటీసులు ఇస్తున్నా ముందుకు రాని వారిపై యూనిలేట్రల్‌ క్యాన్సిలేషన్‌ను ప్రయోగించాలని పరిశ్రమల శాఖ అధికారులు నిర్ణయించారు. దీంతో ఏపీ ఐఐసీ అధికారుల మాటలను పక్కన పెడుతూ వాయిదాలు వేస్తున్న పారిశ్రమిక వేత్తలకు గట్టి దెబ్బే తగలనుంది.

ఏళ్లు గడుస్తున్నా..
జిల్లాలో నాలుగు పారిశ్రామిక వాడలున్నాయి. బొబ్బిలి, నెల్లిమర్ల, కంటకాపల్లి, విజయనగరం. ఇందులో కంటకాపల్లి భూములను ఎక్కడివక్కడన్న చందంగా పారిశ్రామిక వేత్తలకు అప్పగించారు. మిగతా ప్రాంతాల్లో ఏపీఐఐసీ రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యాలను కల్పించేందుకు కోట్లు ఖర్చు చేసింది. సేకరించిన భూములను చదును చేసి ప్లాట్లుగా విభజించి వివిధ పారిశ్రామిక వేత్తలతో డీడ్‌ కుదుర్చుకుంది. ఈ మేరకు అగ్రిమెంట్‌ అయిన యాజమాన్యాలు కేవలం మూడు నెలల్లోనే పరిశ్రమల నిర్మాణాలు ప్రారంభించాలి. కానీ ఏళ్లు గడుస్తున్నా అధికారులు నోటీసులు ఇస్తున్నా వీరు వెరవడం లేదు.

యూనిలేట్రల్‌ క్యాన్సిలేషనే మందు!
పరిశ్రమ ఏర్పాటు చేయకుంటే వారి నుంచి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఆన్‌లైన్‌లో మళ్లీ కొత్త ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం పొందుపరుస్తారు. వారి మొదటి డీడ్‌ను క్యాన్సిలేషన్‌ చేయాలి. ఇందుకోసం ఏపీఐఐసీ అధికారులు, యాజమాన్యాలు రిజిస్టర్‌ కార్యాలయంలో ఒప్పందాల రద్దుకు ఉమ్మడిగా సంతకాలు చేయాలి. కానీ నోటీసులు అందుకుంటున్న ప్రతిసారీ ఏవో సాకులు చెబుతున్న యాజమాన్యాలు రద్దుకు మాత్రం రావడం లేదు. దీనికి యూనిలేట్రల్‌ క్యాన్సిలేషనే మందని అధికారులు నిర్ణయించారు. సుమారు 40 మంది పారిశ్రామిక వేత్తలకు కొన్ని సంవత్సరాలుగా నోటీసులు ఇస్తున్నారు. వారికి ఇచ్చిన లీజు, డీడ్‌ అగ్రిమెంట్‌ కాలం తదితర అంశాలను అనుసరించి పరిశ్రమలు నిర్మించని వారి నుంచి గడువులోగా సమాధానం కోసం చూస్తున్నారు. వారి నుంచి గతంలో లానే నిర్ణీత కాలంలోగా సమాధానం రాకపోతే వెంటనే యూనిలేట్రల్‌ క్యాన్సిలేషన్‌ ప్రయోగం ద్వారా డీడ్‌ అగ్రిమెంట్‌ను రద్దు చేస్తారు. వెంటనే ఆయా ప్లాట్లను కొత్త ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కేటాయించేందుకు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.
బొబ్బిలిలో ఐదుగురు! 
జిల్లావ్యాప్తంగా పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకు రాకుండా ఉన్న వారు సుమారు 35 మంది ఉన్నారని ఓ అంచనా! ఇందులో బొబ్బిలిలోనే ఐదుగురున్నట్టు గుర్తించారు. వీరు పరిశ్రమలు స్థాపించకపోవడమే కాకుండా స్థలం పొందిన నాటి నుంచి ఎటువంటి ప్రొసీజరూ నడపకుండా ఉన్నవారి కింద లెక్క. ఏదో ఒక ప్రోసెస్‌లో ఉన్న వారికి మాత్రం ఈ విధంగా ఏకపక్షంగా రద్దు చేసే ప్రయత్నం చేయకుండా మరో మారు అవకాశం ఇచ్చి ఆ తరువాత మిగతా వారికి కూడా ఇదే విధానాన్ని అమలు చేసి స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం అవుతోంది.

మరిన్ని వార్తలు