నాగశౌర్య, సందీప్‌ కిషన్‌లకు గాయాలు

16 Jun, 2019 02:54 IST|Sakshi

ఆరిలోవ (విశాఖ తూర్పు)/ కర్నూలు సీక్యాంప్‌:  రెండు సినిమా చిత్రీకరణల్లో ఇద్దరు తెలుగు హీరోలు నాగశౌర్య, సందీప్‌ కిషన్‌ గాయాలపాలయ్యారు.  విశాఖ, కర్నూలు జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. విశాఖ జిల్లా ఆరిలోవలో షూటింగ్‌ చేయడానికి హీరో నాగశౌర్య, చిత్ర బృందం శుక్రవారం అక్కడికి చేరుకుంది. అదే రోజు అంబేడ్కర్‌నగర్‌లో రెండు అంతస్తులు ఉండే ఓ భవనం పైనుంచి హీరో నాగశౌర్య కిందకు దూకే సీన్‌ చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పి ఆయనకు కాలు బెణికింది. పెద్దగా వాపు వచ్చి నడవలేకపోవడంతో వెంటనే షూటింగ్‌ బృందం నాగశౌర్యను హెల్త్‌సిటీలో ఉన్న పినాకిల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కాలుకు కట్టువేసిన వైద్యులు సుమారు 30 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

అలాగే జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వారం రోజులుగా కర్నూలు నగరంలో సందీప్‌ కిషన్‌ హీరోగా తెనాలి రామకృష్ణ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. శనివారం బాంబ్‌ బ్లాస్టింగ్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఫైట్‌ మాస్టర్‌ చేసిన తప్పిదం వల్ల సందీప్‌ కిషన్‌ ఛాతీ, కుడిచేతిపై గాజుముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే అక్కడి సిబ్బంది సందీప్‌ను నగరంలోని మైక్యూర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

మరిన్ని వార్తలు