ఏసీబీ వలలో శానిటరీ ఇన్‌స్పెక్టర్

14 Oct, 2015 11:31 IST|Sakshi

కాంట్రాక్టు కార్మికుని ఉద్యోగానికి లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
 
గోపాలపట్నం: గోపాలపట్నంలోని 66వ వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్రావు మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. కాంట్రాక్టు కార్మికుని ఉద్యోగం కోసం రూ. 30 లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కాడు. వివరాలివీ... వార్డులో కన్నమ్మ అనే కాంట్రాక్టు కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అతని కొడుకు శివ కి ఆ ఉద్యోగం ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ తరుణంలో కొంతకాలంగా శివ ఇక్కడి శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్రావు చుట్టూ తిరుగుతున్నాడు. అయితే రూ.30 వేలు ఇస్తేనే ఉద్యోగం అని శానిటరీన్‌స్పెక్టర్ తెగేసి చెప్పాడు. దీంతో శివ మొదటి సారి అప్పు చేసి రూ.10 వేలిచ్చాడు. తర్వాత స్థోమత లేదని చెప్పినా తాను చెప్పినంత ఇవ్వాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఒత్తిడి చేశాడు.

ఏం చేయాలో పాలుపోక శివ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఇక్కడి కొత్తపాలెంలో ఉన్న వార్డు కార్యాలయంలో ఈశ్వర్రావుకి శివ రూ.10 వేలు ఇచ్చాడు. ఆ మొత్తాన్ని ఇక్కడ పనిచేస్తున్న రమణి ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్ తీసుకున్న వెంటనే ఏసీడీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్‌తో పాటు సీఐలు రామకృష్ణ, రమేష్, రమణమూర్తి దాడి చేసి పట్టుకున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌తో పాటు రమణిని అదుపులోకి తీసుకుని వేలిముద్రలు సేకరించారు. రికార్డులు పరిశీలించారు. ఈశ్వర్రావుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు