స్వయంకృషితో..! 

3 Jan, 2020 08:54 IST|Sakshi
చేయి లేకపోయినా ల్యాప్‌టాప్‌పై జాబ్‌ వర్కు చేస్తున్న కాంతారావు

స్ఫూర్తిగా నిలుస్తోన్న దివ్యాంగుడు కాంతారావు 

తనతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్న వైనం 

పలాస: ఒకవైపు పేదరికం.. మరోవైపు అంగవైకల్యం.. అయినా అతడు కుంగిపోలేదు.. బాలారిష్టాలను ఎన్నో ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి స్వయం ఉపాధి పొందుతున్నాడు. తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఆయనే పలాస మండలం మాకన్నపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు సైన కాంతారావు(36). నిరుపేద కుటుంబానికి చెందిన కామేశ్వరరావు, లక్ష్మీదంపతులకు కాంతారావుతో పాటు అన్న, తమ్ముడు, చెల్లెమ్మలు ఉన్నారు. పెద్దవాడు జగదీష్‌ మూగవాడు. కాంతారావుకి రెండు చేతులు లేవు. అయినా తోటి పిల్లలతో ఆడుకుంటూ చదువుకోవాలని కోరిక బలంగా ఉండేది. కాలి వేళ్లతో పలకమీద అక్షరాలు దిద్దడం ప్రారంభించాడు

అకుంఠిత దీక్షతో విద్యాభ్యాసం
బొడ్డపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు వెళ్లి  పదో తరగతి పూర్తి చేశాడు. పాఠశాలలో క్రికెట్, చెస్, క్యారం ఆటలు  కూడా ఆడేవాడు. కాశీబుగ్గలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్, బి.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బి.ఎ, స్థానికంగా బీఈడీ సైతం పూర్తి చేశాడు. కాశీబుగ్గలో కంప్యూటరు కోర్సు చదివి ఓవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూనే మరోవైపు కాశీబుగ్గలో ఇంటర్‌నెట్‌ సెంటర్‌ పెట్టి స్వయం ఉపాధి పొందుతున్నాడు. తన కుటుంబాన్ని పోషించడమే కాకుండా మరో నలుగురికి తన నెట్‌ సెంటర్‌లోనే ఉపాధి చూపిస్తూ ఆదర్శంగా నిలిచాడు. ప్రస్తుతం కాశీబుగ్గలో భార్య, పాపతో కలిసి ఒక అద్దె ఇంటిలో జీవనం సాగిస్తున్నాడు.

మరిన్ని వార్తలు