తూర్పుగోదావరి : ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి దోహదం చేసే ఐసీడీఎస్ను సంస్థాగతం చేసేలా కృషి చేయాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కొవ్వాడ వద్ద జగన్ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ కేంద్రాల నిర్వహణలో పనిభారం పెరిగిందని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీం కోర్టు తీర్పునకు అనుకూలంగా వేతనాలు అందడంలేదని అన్నారు. కేంద్రాల కుదింపు నిర్ణయాల వల్ల తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించడం ద్వారా నిర్వహణ నాణ్యత పెరుగుతోందన్నారు. ఐసీడీఎస్ను బలోపేతం చేసే దిశగా కృషి చేయాలంటూ జగన్ను అంగన్వాడీలు కోరారు.