అధికార పార్టీ నేత నిర్వాకం

19 Mar, 2019 11:34 IST|Sakshi
ఫిబ్రవరి 27న కుందూ నదిలో పడిన ట్రాక్టర్‌

సాక్షి, ప్రొద్దుటూరు : అధికార పార్టీని అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెరతీసిన సంఘటన ప్రొద్దుటూరు మండలంలోని చర్చాంశనీయంగా మారింది. వాస్తవానికి 20 రోజుల క్రితం ప్రమాదవశాత్తు కుందూనదిలో ట్రాక్టర్‌ బోల్తాపడి తీవ్రంగా నష్టం జరిగింది. డ్రైవర్‌ కూడా గాయపడ్డాడు. అయితే అప్పుడు ట్రాక్టర్‌కు ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లింపునకు గడువు ముగి యడంతో యజమాని ట్రాక్టర్‌ను నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లించి బీమా కోసం అదే ప్రాంతంలో ట్రాక్టర్‌ను మళ్లీ పడేశారు. తద్వారా ఇన్సూరెన్స్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌ దువ్వూరు మండలంలోని ఎర్రబల్లి గ్రామానికి చెందిన రోడ్డు నిర్మిస్తున్నారు.

రోడ్డు నిర్మాణంలో భాగంగా రోజూ ప్రొద్దుటూరు మండలంలోని నక్కలదిన్నె గ్రామం వద్ద ఉన్న కుంటకు వచ్చి మట్టి తీసుకెళుతున్నారు. ఇలా వచ్చి వెళుతుండగా గత నెల 27న ఉదయం 7.30 గంటలకు మార్గం మధ్యలోని కుందూ నదిలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రాక్టర్‌ పడింది. టీడీపీ ఇన్‌చార్జి వరదరాజులరెడ్డి స్వగ్రామమైన కామనూరుకు చెందిన రామముర్తి కుమారుడు డ్రైవర్‌గా ఉన్నాడు. వాస్తవంగా ఆయనకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా లేదు. ప్రమాద సమయంలో చాలా వరకు డీజల్‌ కారిపోయి కిందపడింది. ఇది జరిగిన సంఘటన. 

ప్రస్తుతం జరిగిన సంఘటన 
ప్రమాదం జరిగిన రోజున క్రేన్‌ సహాయంతో చుట్టుపక్కల ప్రజలు చూస్తుండగా ట్రాక్టర్‌ను తీసుకెళ్లారు. ఏడాది క్రితం కొనుగోలు చేసిన ఈ ట్రాక్టర్‌కు ఇన్సూరెన్స్‌ ప్రీమియం గడువు చెల్లింపు ఆలస్యమైంది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ శివనాగిరెడ్డి ఇటీవల ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లించారు. ఇన్సూరెన్స్‌ కోసం సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో డ్రైవర్‌ ద్వారా ట్రాక్టర్‌ను తీసుకొచ్చి అదే కుందూ నదిలో పడేశారు. ఈ విషయాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని టీడీపీ ఇన్‌చార్జి వరదరాజులరెడ్డి బంధువులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు.  

మరిన్ని వార్తలు