ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

27 Feb, 2016 00:58 IST|Sakshi

ఇంటర్ విద్యార్థులకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో నాలుగు రోజుల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లూ దాదాపు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 47,778 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, వారి కోసం 66 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నడూ లేనివిధంగా ఈ సారి జీపీఎస్ విధానం అనుసంధానం చేశారు. దీంతో పరీక్ష తీరుతెన్నులన్నీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు గమనించవచ్చు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు.  
 
 
మార్చి 2 నుంచి 21 వరకు పరీక్షలు

విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మార్చి రెండు నుంచి జరగనున్న వార్షిక పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యూరు. పరీక్ష కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ, సాధారణ, సమస్యాత్మకం, అతి సమస్యాత్మకం పరీక్ష కేంద్రాల గుర్తింపు, నిఘా పెంపు వంటి అంశాలపై దృష్ణి సారించారు. దూరప్రాంతాల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ అధికారులతో చర్చించి రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు.   మార్చి 2 నుంచి 21 వరకు ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నారుు.
 
66 కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 66 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 47,773 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.  వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 24,062 మంది ( జనరల్: 21,705, ఒకేషనల్: 2,357 మంది) ఉన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20,455 మంది ( జనరల్: 18,808, ఒకేషనల్: 1,647 ), ప్రైవేటు విద్యార్థులు 3,256 మంది (జనరల్: 3,078. ఒకేషనల్: 178 ) ఉన్నారు. ఈ పరీక్షలు జంబ్లింగ్ విధానంలోనే జరగనున్నాయి.  
 
పక్కగా నిర్వహణ

ఇంటర్ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గతేడాది 68  కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా అందులో ఐదింటిని రద్దు చేసి కొత్తగా మూడు కేంద్రాలను మాత్రమే ఎంపిక చేశారు. దీంతో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.  
 
జీపీఎస్‌కు అనుసంధానం...

పరీక్ష కేంద్రాలను జీపీఎస్‌తో అనుసంధానం చేస్తున్నారు. దీంతో పరీక్ష జరుగుతున్న తీరు, పర్యవేక్షకుల పనితీరు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. అలాగే  ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న తొమ్మిది కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. పాచిపెంట మండలం పి.కోనవలస గిరిజన కళాశాలలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ఇంటర్మీడియట్ ప్రాంతీయ తనిఖీ అధికారి విజయలక్ష్మి చెప్పారు.
 
పరీక్ష కేంద్రాలు

ప్రభుత్వ కళాశాలు-21, ఎయిడెడ్ కళాశాలలు-05, మోడల్ పాఠశాలలు-04, ఏపీఎస్‌డబ్లూఆర్ జూనియర్ కళాశాలలు-05, గిరిజన కళాశాలలు -04, ఏపీ గురుకుల కళాశాలలు-01, ప్రైవేటు అన్ అయిడెడ్ జూనియర్ కళాశాలలు-26 ఉన్నాయి. పరీక్షల నిర్వహణలో 145 మంది సిబ్బంది పాల్గొంటారు.

>
మరిన్ని వార్తలు