అరగంట ముందెళ్లాలి

10 Mar, 2015 03:04 IST|Sakshi

 రేపటి నుంచి 31 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు
 103 కేంద్రాల్లో.. జీపీఎస్ నిఘాలో..ఏలూరు సిటీ :ఇంటర్మీడియెట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి ఈనెల 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో జరుగుతున్న తొలి పరీక్షలు కావటంతో కాలేజీ యాజ మాన్యాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జిల్లాలో 103 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్టియర్, సెకండియర్ కలిపి ఈ ఏడాది 68,109 మంది పరీక్షలు రాయనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య 8,640 పెరిగింది. గత ఏడాది 59,469 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ఈ ఏడాది 68,109 మందిపరీక్షలు రాయనున్నారు.
 
 వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 33,394 మంది కాగా, జనరల్ కోర్సులకు సంబంధించి 30,297 మంది ఉన్నారు. వీరిలో బాలురు 13,687మంది, బాలికలు 16,610 మంది. 3,097 మంది ఒకేషనల్ కోర్సులకు విద్యార్థులుండగా, వారిలో ాలురు 1,735 మంది, బాలికలు 1,362 మంది ఉన్నారు. సెకండియర్‌కు సంబంధించి 34,715 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, వారిలో జనరల్ కోర్సుల విద్యార్థులు 30,907 మంది ఉన్నారు. వీరిలో బాలురు 14,296 మంది, బాలికలు 16,611 మంది. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 3,808 మంది విద్యార్థుల్లో బాలురు 2,018 మంది, బాలికలు 1,790 మంది ఉన్నారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
 
 జీపీఎస్ నిఘా
 గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సహాయంతో ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాల నుంచి సెల్‌ఫోన్ల ద్వారా వెళ్లే ప్రతి కాల్‌ను రికార్డు చేసేలా చర్యలు చేపట్టారు. ఎక్కడైనా అనుమానం, ఆరోపణలు వస్తే వెంటనే ఆయా సెంటర్లకు సంబంధించిన కాల్స్‌ను పరిశీలిస్తారు. సెల్‌ఫోన్ల ద్వారా ప్రశ్నాపత్రాల లీకేజీలకు బ్రేక్‌లు వేయటంతోపాటు, ఇంటిదొంగల భరతం పట్టేందుకు ప్రణాళిక రచించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు సెల్‌ఫోన్ వాడే అవకాశం ఉంది. అదీకూడా పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ కోసం మాత్రమే. ఆలస్యంగా వచ్చే విద్యార్థులు సహేతుకమైన కారణాలు తెలియజేయాల్సి ఉందని ఆర్‌ఐఓ బి.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. జిల్లాలో నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్లు, జిల్లా హైపవర్ కమిటీ ఏర్పాటు చేశారు. 103 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 103 మంది డిపార్టుమెంటల్ అధికారులు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటిండెంట్లను నియమించారు. 35 రూట్లలో ప్రశ్నాపత్రాలు పంపిణికీ ఏర్పాట్లు చేశారు.
 
 పటిష్ట చర్యలు
 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించటంతోపాటు ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. విద్యార్థులు అర్ధ గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. నియమిత సమయం అనంతరం ప్రవేశం ఉంది. ఇందుకు సహేతుకమైన కారణాలు చూపించాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులెవరూ సెల్‌ఫోన్లు తీసుకువెళ్లకూడదు. ఇన్విజిలేటర్లు కూడా సెల్‌ఫోన్లు వాడకుండా చర్యలు చేపట్టాం. పరీక్షా కేంద్రాల సమీపంలో నెట్ సెంటర్లు, జిరాక్స్ కేంద్రాలను మూసివేయిస్తాం. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుంది.
 - బి.వెంకటేశ్వరరావు, ఆర్‌ఐవో
 

>
మరిన్ని వార్తలు