సర్వం సిద్ధం

1 Mar, 2016 23:48 IST|Sakshi

  నేటినుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
  జిల్లాలో రాయనున్న విద్యార్థుల సంఖ్య 47,773
  66 కేంద్రాల్లో పరీక్షలు
  అర్ధగంట ముందే చేరుకోవాలని సూచన
  నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టీకరణ
  వెబ్‌సైట్ ద్వారా ‘హాల్‌టికెట్’ డౌన్‌లోడ్

 
 విజయనగరం అర్బన్: జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలిరోజున ప్రథమ ఇంటర్ పరీక్షలు, రెండో రోజు సీనియర్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. జిల్లాలోని 170 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలలకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. ప్రథమ సంవత్సరం 24,062 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 23,711 మంది కలిపి మొత్తం 47,773 మంది పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 66కేంద్రాలను ఏర్పాటు చేశారు. 66 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 66 మంది డిపార్ట్‌మెంట్ అధికారులు, పదిమంది సిట్టింగ్ స్క్వాడ్లు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పనిచేస్తాయి. ప్రతి కేంద్రంలోనూ జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు.
 
 అరగంట ముందే చేరుకోవాలి
 పరీక్షల సమయపాలనలో స్వల్ప మార్పులు చేశారు. గతేడాది ఉదయం 9 గంటల్లోగా పరీక్ష కేంద్రానికి తప్పనిసరిగా చేరుకోవాలనే నిబంధన విధించారు. ఈసారి అర్ధగంట ముందే అంటే ఉదయం 8.30 గంటలకు కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదని బోర్ఢు అధికారులు స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాలను సైతం 8.45 గంటలకు పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు. ఒకసారి విద్యార్థికి ప్రశ్నపత్రం ఇచ్చాక ఏకారణం చేతనైనా మాట్లాడించడం, ప్రశ్నలు వేయటం చేయకూడదు. కేంద్రాల్లో ఫర్నిచర్, తాగునీరు, వెలుగు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
 
 వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్
 కళాశాల యాజమాన్యం ఏ కారణం చేతనైనా హాల్‌టిక్కెట్ ఇవ్వని నేపధ్యంలో విద్యార్థి పరీక్షకు హాజరుకాలేని పరిస్థితి రాకూడదని ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పోటీ పరీక్షల మాదిరిగానే అభ్యర్థి నేరుగా హాల్‌టికెట్‌ను ‘బిఐఇఏపీ.సీజీజీ.జిఓవిటి.ఐఎన్’ వెబ్‌సైట్ నుంచి తీసుకునే అవకాశం కల్పించారు.

>
మరిన్ని వార్తలు