‘లడ్డూలు తినాలన్న కోరికే ఇలా మార్చింది’

30 Oct, 2019 10:47 IST|Sakshi

స్వయంకృషితో ఎదిగాను

36 దేశాల్లో 37 వేల ఇంద్రజాల ప్రదర్శనలు

నాలుగు ప్రపంచ రికార్డులు

 అంతర్జాతీయ ఇంద్రజాలికుడు జాదూగర్‌ ఆనంద్‌

సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : ఐదు దశాబ్దాల కాలంలో 36  దేశాల్లో  37 వేలకుపైగా ఇంద్రజాల ప్రదర్శనలు. 4 ప్రపంచ రికార్డులు. వేలాది సన్మానాలు. ఇంద్రజాలంతో వయోబేధం లేకుండా అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అసమాన∙ప్రతిభ కలిగిన వ్యక్తి అతను. ఆయనే జాదూగర్‌ ఆనంద్‌గా ప్రసిద్ధికెక్కిన ప్రముఖ ఇంద్రజాలికుడు ఆవíస్తి ఆనంద్‌.  ఇంద్రజాల ప్రదర్శనలో భాగంగా  మదనపల్లెకు వచ్చిన ఆయనతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.

సాక్షి : మీ పేరు...కుటుంబ నేపథ్యం?
ఆనంద్‌ : నా పేరు ఆవస్తి ఆనంద్‌. మాది మధ్యప్రదేశ్‌ రాష్ట్రం, జబల్‌పూర్‌ నగరం. 1952లో జనవరి 3న జన్మించాను. మాది ఉన్నత విద్యావంతుల కుటుంబం. నాన్న ఏ.పి.అవస్తి, వృత్తిరీత్యా వైద్యుడు. అమ్మ మహేశ్వరిదేవి ఫ్రొఫెసర్‌. జబల్‌పూర్‌లో పాఠశాల విద్య,ఇండోర్‌లో మెట్రిక్యులేషన్, డిగ్రీ, పీజీ పూర్తి చేశాను. మా అమ్మానాన్నలకు నలుగురు సంతానం. ముగ్గురు అక్కయ్యలు. నేను చివరి వాడిని.

సాక్షి : మీకు ‘జాదూగరి’వైపు దృష్టి ఎప్పుడు మళ్లింది?
ఆనంద్‌ : నాకు ఆరేళ్లు ఉన్నప్పుడు పాఠశాలకు వెళ్లేదారిలో కొందరు గారడీ చేసేవారు. రోజూ అక్కడికి వెళ్లి గారడీ చూసేవాడిని. వారు గాల్లో నుంచి నాకు లడ్డూలు తీసి ఇచ్చేవారు. రోజూ లడ్డూలు ఉచితంగా తినేవాడిని. కొన్ని రోజులయ్యాక గారడీవారు మకాం మార్చేస్తే, లడ్డూలు తినడానికి అలవాటుపడిన నాకు లడ్డూల మీద ఉన్న కోరికతో వారిని వెతుక్కుంటూ వెళ్లేవాడిని. ఆ సమయంలో స్వతహాగా నేను కూడా గారడీ చేసి లడ్డూలు తయారు చేయాలని అనుకున్నా. ప్రయత్నించి విఫలమయ్యాను. కానీ ప్రయత్నం వదలలేదు. ఎక్కడ గారడీ, మ్యాజిక్‌ షోలు జరిగినా వెళ్లి చూసేవాడిని. అలా ..అలా చిన్నపాటి మేజిక్‌లు నేర్చుకుని, మా స్కూల్లో ప్రదర్శించి, అందరి మన్ననలు పొందేవాడిని. గణేష్, దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాలలో నా ప్రదర్శనలు ఇచ్చేవా డిని. వారు ఇచ్చే డబ్బులు అమ్మా,నాన్న పాకెట్‌ మనీతో ఇంద్రజాలానికి సంబంధించిన పుస్తకాలను కొనేవాడిని. అలా మొదలైన నా ప్రస్థా నం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి ‘జాదూగర్‌’గా మార్చింది. ∙నాకు గురువులు ఎవరూలేరు. స్వయంకృషితో ఈ స్థాయికి చేరా.

సాక్షి : మీకు తల్లిదండ్రుల సహకారం ?
ఆనంద్‌ : లేదు. మా అమ్మానాన్నలు నన్ను కూడా డాక్టర్‌ చేయాలనుకున్నారు. నేను మెజీషి యన్‌ అవడం ఏమాత్రం వారికి ఇష్టం లేదు. 

సాక్షి : మేజిక్‌ ఎప్పటి నుంచి చేస్తున్నారు? 
ఆనంద్‌ : 18 ఏళ్ల వయసులో ‘ఇంద్రజాలం’ చేయడం ప్రారంభించా. అంతే కాదు ఒళ్లు గగు ర్పొడిచే నదిలో ‘అండర్‌ వాటర్‌ ఎస్కేప్‌ విన్యా సాన్ని 40 సెకండ్లలో ప్రదర్శించి  బయటకు వచ్చేశా. ఇది కూడా స్వతహాగానే నేర్చుకున్నా.

సాక్షి : ఎన్ని రికార్డులు సాధించారు?
ఆనంద్‌ : ఇప్పటి వరకు నేను 4 ప్రపంచ రికార్డులు సా«ధించా. 18 ఏళ్ల వయస్సులో అండర్‌ వాటర్‌ ఎస్కేప్‌గా మొదటి రికార్డు. 19 ఏళ్లప్రాయంలో బ్లైండ్‌ ఫోల్డ్‌ఫో నిర్వహించి రెండో ప్రపంచ రికార్డు సాధించా. ఇండోర్‌ నుంచి భూపాల్‌ వరకు 210 కిలోమీటర్లు కళ్లకు గంతలు కట్టుకుని బైక్‌ మీద ప్రయాణం చేయడం. 36 దేశాలలో 37 వేలకుపైగా ప్రదర్శనలు నిర్వహించి మూడో ప్రపంచ రికార్డు సాధించా. అత్యంత వేగవంత మెజీషియన్‌గా 4వ ప్రపంచ రికార్డు సాధించా.  

సాక్షి : ప్రభుత్వపరంగా ఎలాంటి సహకారం ఆశిస్తున్నారు?
ఆనంద్‌ : ఇంద్రజాలాన్ని ప్రభుత్వాలు ఓ కళగా గుర్తించాలి. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో మ్యాజిక్‌ అకాడమీలు ఏర్పాటు చేసి ఇంద్రజాలాన్ని ప్రోత్సహించాలి.

మరిన్ని వార్తలు