‘ఇన్‌టైమ్ సర్వీసు’కు కాంట్రాక్టు రద్దు

5 Mar, 2014 02:29 IST|Sakshi

 శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రా క్టు పద్ధతిపై భర్తీ చేసేందుకు ఇన్‌టైమ్ సర్వీసు సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టును కలెక్టర్ సౌరభ్‌గౌర్ రద్దు చేశారు. ఈ సంస్థ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో స్పందించిన ఆయన ఈ మేరకు నిర్ణయించారు. తిరిగి ప్రకటన వెలువరించాలని ఆర్‌వీఎం అధికారులకు ఆదేశించారు.
 
 ఎఫ్‌ఏవో సరెండర్ సాధ్యమేనా?
 
 ఇదే విషయంలో ఎఫ్‌ఏవో ప్రముఖ పాత్ర వహించారని కలెక్టర్ గట్టి నమ్మకానికి వచ్చి ఆయనను సరెండర్ చేయాలని పీఓకు ఆదేశించినా అది సాధ్యమయ్యే పనేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. జి.రాజు అనే ఖజానా శాఖ ఉద్యోగి అయిదేళ్ల క్రితం డిప్యుటేషన్‌పై రాజీవ్ విద్యామిషన్‌కు వచ్చారు. డిప్యుటేషన్ మూడేళ్లతో ముగియాల్సి ఉన్నప్పటికీ ఫారెన్ సర్వీసెస్ సౌలభ్యం రావడంతో అయిదేళ్లు వరకు ఉండే అవకాశం వచ్చింది.
 
 ఈ కాలంలో ఆయన పదోన్నతులు సైతం వదులుకున్నారు. అయిదేళ్ల గడువు ముగిసిన తరువాత పదోన్నతి పొంది ఖజానా శాఖలో ఒకటి, రెండు రోజులు పనిచేసి మళ్లీ ఆర్‌వీఎంకు డిప్యుటేషన్ వేయించుకున్నారు. దీనివల్ల కొత్తగా డిప్యుటేషన్‌పై నియమించినట్లు అయింది. అందువల్ల ఎఫ్‌ఏఓను సరెండర్ చేయడం సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడుతుండగా ఛైర్మన్ హోదాలో కలెక్టర్ ఏ స్థాయి అధికారినైనా సరెండర్ చేసే అధికారం ఉందని ఇంకొందరు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
 

>
మరిన్ని వార్తలు