నకిలీ ఇంగ్లిష్ టీచర్లపై దర్యాప్తు ముమ్మరం

21 Nov, 2013 03:25 IST|Sakshi

 కొణిజర్ల(వైరా),న్యూస్‌లైన్:  జిల్లాలో తప్పుడు సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందిన 66 మంది ఇంగ్లిష్ ఉపాధ్యాయులపై సీబీసీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసిందని, ఈ నివేదిక రాగానే సంబంధిత ఉపాధ్యాయులపై చర్య తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి రవీంద్రనాథ్  రెడ్డి తెలిపారు. బుధవారం వైరాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సదరు ఉపాధ్యాయులపై శాఖా పరమైన దర్యాప్తు పూర్తి చేసి,  క్రిమినల్ కేసులకు సిఫారసు చేసినట్లు తెలిపారు. అలాగే తప్పుడు వైద్య ధ్రుపత్రాలతో రీయింబర్స్‌మెంట్ పొందిన 21 మంది ఉపాధ్యాయులకు 3 ఇంక్రిమెంట్లు కోత విధిస్తున్నట్లు తెలిపారు.

పదో తర గతి విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ నుంచి ఇచ్చే స్టడీ మెటీరియల్ రెండు మూడు రోజుల్లో అన్ని పాఠశాలలకు పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో 33 మోడల్ స్కూళ్లు ఈ ఏడాది ప్రారంభం కావాల్సి ఉండగా స్థలం లేక 31 పాఠశాలలు ప్రారంభం కాలేద ని, రెండు పాఠశాలలు మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయని వివరించారు. జాతీయ సగటు మహిళా అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న మండలాల్లో మాత్రమే మోడల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియ కోర్టులో ఉన్నందున ప్రభుత్వం నుంచి వచ్చే ఉత్తర్వులకు అనుగుణంగా పదోన్నతులు చేపట్టి, షెడ్యూలు విడుదల చేస్తామన్నారు.

ఆర్‌వీఎం పీఓ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో ఆర్‌వీఎం ద్వారా ఈ ఏడాది రూ.84.65 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.62.51 కోట్లు వివిధ పనులకు ఖర్చు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మరుగుదొడ్ల మరమ్మతులకు నిధులు పుష్కలంగా విడుదల చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏఎంఓ వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు