బెట్టింగ్‌ను పట్టించుకోరా?

24 May, 2015 01:43 IST|Sakshi

 ఏలూరు (సెంట్రల్), న్యూస్‌లైన్ :నగరంలో క్రికెట్ బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెట్ ఆటగాళ్లు అందరూ కలసి ఆడే ఐపీఎల్ టీ 20 మ్యాచ్‌లు కీలక దశకు చేరడంతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ మ్యాచ్‌లను తిలకిస్తున్నారు. నగరంలోని చాలాచోట్ల ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్ విస్తరించింది. ఆదివారం జరిగే ఫైనల్‌తో ఐపీఎల్ మ్యాచ్‌లు ముగియనున్నాయి. దీంతో పందెపురాయుళ్లు మరిం తగా విజృభించనున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం బెట్టింగ్‌లపై సరైన నిఘా పెట్టకపోవడంతో పందెం రాయుళ్లకు అడ్డూ అదుపు లేకుండాపోయింది.
 
  బుకీలు చెప్పే మాయ మాటలను విని నగరంలోని చాలామంది యువకులు బెట్టింగ్‌లు కాస్తూ అప్పులపాలౌతున్నారు. ఆ అప్పులు తీర్చలేక, తమ ఇంటిలో చెప్పలేక  ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. గత ఏడాది స్థానిక అముదాల అప్పలస్వామి కాలనీకి చెందిన గాజుల కృష్ణసాయి(21) ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఏలూరులోని ఓ గ్యాస్ కంపెనీలో గుమస్తాగా పనిచేసేవాడు. క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి తెలిసిన వాళ్లందరి దగ్గర సుమారు రూ.4 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పల వారి నుంచి వేధింపులు ఎక్కువవడంతో గత ఏడాది  రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
  వేగవరానికి చెందిన ఓ యువకుడు గత ఏడాది బెట్టింగ్‌లు ఆడి నిద్రమాత్రలను మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బుకీలు నగరంలోని హోటళ్లలో గదులను అద్దెకు తీసుకుని బెట్టింగ్ సాగిస్తున్నారు. శాంతినగర్, సత్రంపాడు వంటి చోట్ల ఇళ్లను అద్దెకు తీసుకుని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. క్రికెట్ బుకీలు పోలీసులు తమ జోలికి రాకుండా నెలసరి మామూళ్లూ పంపించి వేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. శుక్రవారం బెంగళూరు - చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌కు సుమారు రూ.2 కోట్లకు పైగా పందాలు జరిగినట్టు సమాచారం. ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్‌కు కూడా భారీగా బెట్టింగ్‌లు జరిగే అవకాశం ఉంది.
 
 ఏ ఓవర్లో ఎంత?
 ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జరుగుతున్న బెట్టింగ్‌లో పందెంరాయుళ్లు ఎక్కువగా ఫ్యాన్సీలపై మక్కువ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పందాలు ఒక ఓవర్లో ఎన్ని రన్స్ కొడతారు. ఎన్ని వికెట్‌లు పడతాయి అనే అంశాలపై జోరుగా సాగుతున్నాయి. మ్యాచ్ జరిగిన రోజు బెట్టింగ్ కాస్తే తరువాత రోజు ఉదయం 10గంటల కల్లా నగదును బుకీకి అప్పగించాలి. సులువుగా డబ్బును సంపాదించేందుకు పలువురు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కానీ ఈ బెట్టింగ్ వల్ల బుకీలకు మాత్రమే ఎక్కువగా లాభం చేకూరుతుందని పలువురు పందెం రాయుళ్లే చెబుతున్నారు.
 
 విద్యార్థులే : ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయంటే చాలు ఎక్కువగా పలు కాలేజీలకు చెందిన విద్యార్థులే ఈ బెట్టింగ్‌కు బలౌతున్నారు. ఒకవేళ మ్యాచ్ తరువాత డబ్బు చెల్లించకపోతే బుకీలే వారికి డబ్బు ను అప్పుగా ఇచ్చినట్టు నోటును రాయించుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికైనా పో లీసు ఉన్నతాధికారులు నగరంలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్‌లపై ప్రతేక్య నిఘాను ఏర్పాటు చేసి, యువత భవిష్యత్తును కాపాడాలని పలువురు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు