దిశ యాప్‌నకు అనూహ్య స్పందన: దీపికా పాటిల్‌

12 Feb, 2020 17:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్‌నకు అనూహ్య స్పందన లభిస్తోందని దిశ చట్టం పర్యవేక్షణ ప్రత్యేక ఐపీఎస్‌ అధికారి దీపికా పాటిల్‌ అన్నారు. యాప్‌ ప్రారంభించిన నాలుగు రోజుల్లో 4, 105 మెసేజ్‌లు వచ్చాయని.. అందులో చాలా వరకు యాప్‌ను పరీక్షించేందుకు చేసినవే ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికి రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని.. 38 ఫిర్యాదులపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. బుధవారం దీపికా పాటిల్‌ మాట్లాడుతూ.. బస్సులో మహిళను వేధించిన కేసులో ఆరు నిమిషాల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఈ నెలాఖరుకల్లా రాష్ట్రంలోని 18 దిశా పోలీస్ స్టేషన్లను సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. (6 నిమిషాల్లో..ఆకతాయి ప్రొఫెసర్‌ ఆటకట్టు)

‘‘దిశా చట్టానికి రాజముద్ర పడే లోపు మహిళా రక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. దిశా యాప్‌పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి మహిళలల్లో చైతన్యం తీసుకువస్తాం. మహిళల పట్ల చిన్న తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకొంటాం. సోషల్ మీడియా వేధింపులపైనా ప్రత్యేక నిఘా పెట్టాం. మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పాన్ని నెరవేర్చే దిశగా దిశా బృందం ముందుకు సాగుతుంది’’ అని దీపికా పాటిల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు