సాక్షి, అమరావతి : ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఉద్యోగ నియమావళి, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కారణంగా అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ నిబంధనల మేరకు సస్పెండ్ చేస్తున్నట్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే సస్పెన్షన్ కాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ వదిలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే.