ఇంటర్‌లో తప్పా.. ఐఏఎస్‌ పాసయ్యా!

16 Jun, 2019 12:26 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఇంటర్మీడియట్‌లో తప్పిన నేను.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని చేరుకోవాలనే బలమైన కోరకతో ఐఏఎస్‌ పాసయ్యాయని అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌ జనరల్‌  కె.సత్యనారాయణ అన్నారు. స్థానిక పీబీ సిద్ధార్థ కళాశాలలో ఉద్యోగదర్శిని పేరుతో వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు జరుగుతున్న ఉచిత శిక్షణా కార్యక్రమం ముగిం పు శనివారం కళాశాల సెమినార్‌ హాలులో జరి గింది. ముఖ్య అతిథిగా హాజరైన సత్యనారాయణ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధించాలనే తపన చాలా బలంగా ఉండాలన్నారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిం చాలనే కోరికతో పాటుగా కష్టపడేతత్వం, క్రమశిక్షణ ఉండాలని చెప్పారు. మొక్కబడిగా చదవడం, రోజు వారి పనులు చేయడం అనేది మంచిది కాదన్నారు. చదువుకునే వయస్సులో మంచి ఆహారం తీసుకోవాలని దాని వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుందని తెలిపారు. తాను ఇంటర్‌తో పాటుగా సివిల్స్‌ను ప్రిపేర్‌ అవుతున్న సమయంలో ప్రిలిమ్స్‌తో పాటుగా మెయిన్స్‌ చాలా సార్లు తప్పానని చెప్పారు. ఓటమి నుంచి తాను పాఠాలు నేర్చుకుంటూ చేసిన తప్పులను గుర్తించి దిద్దుకుంటూ ముందుకు సాగానని వివరించారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలనే కాని కుంగిపోకూడదన్నారు. మన మీద మనకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉండాలని, అప్పుడే విజయాలు సొంతం అవుతాయన్నారు. ఎ.పి.సి.ఆర్‌.డి.ఏ జాయింట్‌ డైరెక్టర్‌ వల్లభనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు గొప్ప నాయకుల జీవిత చరిత్ర పుస్తకాలను చదవాలన్నారు. ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ మురళీ మోహన్‌ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, ప్రణాళికతో చదివితే విజయం తథ్యమన్నారు. విజన్‌ ఫౌండేషన్‌ అధినేత విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ ఉచిత శిక్షణతో ప్రతిభ చూపిన వారికి ఏడాది పాటు ఆన్‌లైన్‌లో విజన్‌ సంస్ధ ఆధ్వర్యంలో నిర్వహించే మాక్‌ టెస్ట్‌లకు అవసరమైన పుస్తకాలు, పాస్ట్‌వర్డ్‌ను ఉచితంగా అందచేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు అవసరమైన శిక్షణను తమ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా అందచేస్తున్నామని తెలియ జేశారు. కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.రమేష్‌తో పాటుగా విద్యార్థులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు