అక్రమార్కులు!

9 Jul, 2015 03:15 IST|Sakshi

యూనివర్సిటీ:  శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో ఉద్యోగుల నిర్లక్షం ఫలితంగా వేల మంది విద్యార్థుల భవిష్యత్ అయోమయంలో పడింది. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, మార్క్స్‌కార్డుల జారీ ఇలా ప్రతి అంశంలోను నిర్లక్ష్యం కనిపిస్తోంది. 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి  62 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ ఫలితాలను గత నెల 18న విడుదల చేశారు.
 
  భారీగా మాస్‌కాఫీయింగ్:  పరీక్షల  నిర్వహణలో మాస్‌కాఫీయింగ్‌ను ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ప్రోత్సహించాయి. ఒకే కళాశాలలో పరీక్షలు రాసిన విద్యార్థులు ఒకేలా రాసేశారు.. కాదు రాయించారు.  అనంతపురం మూల్యాంకన కేంద్రంలో అప్పటి వీసీ పర్యవేక్షణకు వెళ్లగా అధ్యాపకులంతా సార్ మాస్‌కాఫీయింగ్ జరిగిందని ఏకరువు పెట్టడం విశేషం. ప్రతి మండల కేంద్రంలోనూ డిగ్రీ కళాశాలలు విస్తరించిన అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కళాశాలల్లో  ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది.  మాస్‌కాపీయింగ్ జరిగినట్లు మూల్యాంకనంలో   బయటపడ్డా ఎవరినీ విత్‌హెల్డ్‌లో ఉంచకపోవడం కొసమెరుపు.
 పరీక్ష ఫీజు చెల్లించకపోయినా...
 
 892 మంది విద్యార్థులకు సంబంధించి ఆయా డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు పరీక్ష ఫీజు చెల్లించకపోయినా పరీక్షలకు అనుమతి యిచ్చారు.  పరీక్ష ఫీజు కట్టినా కూడా కొన్ని కళాశాల విద్యార్థుల పరీక్ష ఫీజు ఆయా కళాశాలల యాజమాన్యాలు చెల్లించలేదని విత్‌హెల్డ్‌లో ఉంచారు. దీంతో విద్యార్థులకు దిక్కుతోచని స్థితి నెలకొంది.
 
 ఫలితాలను నిలుపదల చేయకపోవడంలో మర్మమేమిటో:
 డిగ్రీ ఫలితాలను గత నెల 18న విడుదల చేశారు. పరీక్షకు గైర్హాజరు అయినా పాస్ అయినట్లు ధ్రువీకరించారు. ఇంటర్నల్ మార్క్స్‌ను కలపకుండా నిర్లక్ష్యం చేసి వేల మంది విద్యార్థులను ఫెయిల్ అయినట్లు ప్రకటించారు. ఇవన్నీ బయటపడడంతో ఫలితాలను నిలుపదల చేసి, సవరణలు చేసిన తర్వాత ఫలితాలను ప్రకటించకపోవడంలో గల ఆంతర్యేమిటోనని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆవార్డు షీట్, చెక్‌లిస్ట్‌ల పరిశీలన తర్వాత ట్యాబులేషన్‌లో నమోదు చేయాలి. నిబంధనలకు విరుద్దంగా మార్క్స్‌కార్డులు జారీ చేయడంతో తప్పిదాలు బయటపడ్డాయి. అయితే ఈ తప్పిదాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో? విద్యార్థుల మార్కులు ఎందుకు మార్చారో? వంటి అంశాలపై స్పందించాల్సిన భాద్యత అందుకు భాద్యులైన ప్రతి ఒక్కరిపై ఉంటుందని విశ్లేషకుల భావన.  
 
 విద్యార్థుల ఇక్కట్లు పట్టనట్లు :
 డీగ్రీ పూర్తీ అయిన తర్వాత పీజీలో అడ్మిషన్స్, వివిధ ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు దక్కిన విద్యార్థులు మార్క్స్ కార్డుల అక్రమాలతో  ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మారుమూల ప్రాంతాలలోని విద్యార్థులు పరీక్షలు బాగా రాసిన ఫెయిల్ అయినట్లు ఫలితాలు రావడంతో ఎవరిని సంప్రదించాలోనని సంశయంలో ఉన్నారు.  
 
 బీఈడీ ప్రాక్టికల్‌కు హాల్‌టికేట్స్ ఇవ్వకపోవడంతో నిలుపదల:
 బీఈడీకి సంబంధించి 6నుంచి 10 వరకు ప్రాక్టికల్ పరీక్షలు  ఈ నెల 26 నుంచి ఆగష్టు 2 వరకు పరీక్షలు జరపాలని షెడ్యూల్‌ను ఖరారు చేశారు. కేవలం హాల్‌టికేట్స్ ఇవ్వడానికి  ఉద్యోగులు  నిరాకరించడంతో 25 బీఈడీ కళాశాలల్లోని విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరపకుండా నిలుపదల చేశారు. హాల్‌టికేట్స్‌ను అందివ్వండని డీన్ లిఖిత పూర్వకంగా పేర్కొన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
 

మరిన్ని వార్తలు