అన్నదాతల భగీరథ యత్నం

14 Mar, 2019 11:58 IST|Sakshi
కాలువ నుంచి డీజిల్‌ ఇంజన్ల ద్వారా సాగునీటిని మినుము పంటకు పైపుల ద్వారా తరలిస్తున్న దృశ్యం

సాక్షి, చీరాలటౌన్‌ (ప్రకాశం): ఆరుగాలం కష్టించి పండించిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. చేతికి అందివచ్చే పంటలకు కావాల్సిన ఆఖరి తడి కోసం తంటాలు పడుతున్నారు. మినుము పంటలు సాగుచేసిన రైతులు తమ పంటలు కాపాడుకోవడానికి డీజిల్‌ ఇంజన్లను వినియోగిస్తున్నారు. వివరాల్లోకెళితే.. మండలంలోని గవినివారిపాలెం, పిట్టువారిపాలెం గ్రామాల్లోని రైతులు మినుము పంటలను 75 ఎకరాల్లో సాగు చేశారు. మరో నెల రోజుల సమయంలో పంట చేతికివచ్చే సమయంలో మినుము పంటకు కావాల్సిన నీటిని సిమెంట్‌ కాలువ నుంచి డీజిల్‌ ఇంజన్లు ద్వారా పైపులతో సరఫరా చేసుకుంటున్నారు.

వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతులకు కావాల్సిన నీటిని అందించడంతో అధికారులు, ప్రభుత్వం విఫలం కావడంతో డీజిల్‌ ఇంజన్లతో ఎకరానికి రూ.3వేలు ఖర్చు చేసి పంటలకు నీరు అందిస్తున్నామన్నారు. పంట చేతికందే సమయంలో కూడా నీటి కోసం తాము కష్టాలను అనుభవిస్తున్నామని రైతులు వాపోతున్నారు. సిమెంట్‌ కాలువల నుంచి డీజిల్‌ ఇంజన్లుతో నీటిని పైపుల ద్వారా పంట భూములకు తరలిస్తున్నారు. ప్రతిఏటా పంటల సాగుచేసే సమయంలో తాము సాగునీటి కోసం భగీరథ యత్నాలు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు