చిన్న నోట్లకు గిరాకీ

21 Oct, 2018 04:35 IST|Sakshi

బ్యాంకులు, పెట్రోలు బంకులను ఆశ్రయిస్తున్న తెలంగాణ నేతలు

ఎన్నికల్లో డబ్బు పందేరానికి సన్నాహాలు

సాక్షి, అమరావతి: తెలంగాణలో ఎన్నికల వేడి మొదలు కావడంతో రాజకీయ నేతలు ‘చిల్లర’ సమస్య ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో పంపిణీ కోసం భారీగా నిల్వ చేసిన రూ.2,000 నోట్లను చిన్న నోట్లలోకి మార్చుకునేందుకు బ్యాంకులు, పెట్రోల్‌ బంకులను ఆశ్రయిస్తున్నారు. దీంతో రూ.500, రూ.200 నోట్లకు గిరాకీ ఏర్పడింది. నోట్లు మార్పిడి చేసినందుకు 2 నుంచి 5  శాతం దాకా కమీషన్‌ ఆఫర్‌ చేస్తున్నారు. బ్యాంకు లావాదేవీలపై ఎన్నికల సంఘం నిఘా వేయటంతో నోట్ల మార్పిడికి తెలంగాణ నేతలు పక్క రాష్ట్రాలపై దృష్టి సారిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్, కర్నాటకలోని ప్రైవేట్‌ బ్యాంకులను సైతం ఎంచుకుంటున్నారు. తనిఖీల్లో తెలం గాణలో పట్టుబడుతున్న నగదులో రూ.500 నోట్లే అత్యధికంగా ఉండటం నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్నారనేది రుజువు చేస్తోంది.

భారీ లావాదేవీలపై ఐటీ, ఆర్బీఐ నిఘా
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో భారీ నగదు లావాదేవీలపై ఐటీ శాఖ, ఆర్‌బీఐ నిఘా వేశాయి. రూ.2 లక్షలకు మించి నగదు తీసుకునే వారి వివరాలను సేకరిస్తున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రూ.5 లక్షలకు మించి నగదు తీసుకుంటే కారణాలను లిఖిత పూర్వకంగా నమోదు చేయాలని తమకు మౌ ఖికంగా ఆదేశాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. తెలంగాణకు చెందిన వివిధ పార్టీల నాయకులు చిన్న నోట్ల కోసం విశాఖ, విజయవాడల్లోని తమ కార్యాలయాలను సంప్రదిస్తున్నట్లు ప్రైవేట్‌ బ్యాంకు అధికారులు ధృవీకరించారు. 

మరిన్ని వార్తలు