ఆటోలకు అడ్డా...ఆర్టీసీ బస్టాండ్‌

6 Mar, 2019 18:24 IST|Sakshi
ఆటో స్టాండ్‌గా మారిన ముక్కామల బస్టాండ్‌ 

సాక్షి, ముక్కామల (అంబాజీపేట): స్థానిక సెంటర్‌లో నిర్మించిన బస్టాండ్‌ ఆటోలకు అడ్డాగా మారిందని ప్రయాణికులు, స్థానికులు విమర్శిస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి బస్టాండ్‌ను రూ.లక్షలు వెచ్చించి 1996లో నిర్మించారు. అప్పటి నుంచి బస్టాండ్‌లోకి బస్‌లు లోపలకు రాకుండా బయట నుంచి వెళ్లిపోవడంతో ప్రయాణికులు రోడ్లపైనే జాగారం చేస్తున్నారు. దాంతో స్థానికుడు వనచర్ల పండు అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు.

ఆర్టీసీ బస్‌లు లోపలకు రాకుండానే బయట నుంచి వెళ్లిపోతున్నాయని, లక్షలాది రూపాయలతో నిర్మించిన బస్టాండ్‌ నిరుపయోగంగా తయారైందని డిపో మేనేజర్‌కు వివరించినట్లు పండు తెలిపారు. బస్టాండ్‌లో ఆర్టీసీ బస్‌లు రాకుండా ఆటోలు అడ్డుగా నిలుపుదల చేస్తున్నారని గతం నుంచి ఆరోపణలు వస్తున్నా ఆర్టీసీ అధికారుల పట్టించుకోలేదనే విషయాన్ని గుర్తు చేశారు. దాంతో ఆర్టీసీ బస్‌లను లోపలకు వచ్చేలా చూడాలని వారం రోజులపాటు బస్టాండ్‌ వద్ద ఉండాలని అధికారులు సూచించారని పండు తెలిపారు. దాంతో ఆర్టీసీ బస్‌లను బస్టాండ్‌ లోపలకు తీసుకుని వస్తున్నారని, అయితే బస్‌లు వచ్చే సమయంలో ఆటోలను అడ్డుగా పెడుతున్నారని వాపోయాడు.

పసుపల్లి గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు బస్టాండ్‌ ఆవరణలో హల్‌చల్‌చేసి భయబ్రాంతులకు గురిచేశాడని ఈ విషయాన్ని అంబాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నాడు. బస్‌లకు అడ్డుగా నిలుపుదల చేయవద్దని కోరితే ఆటో డ్రైవర్‌లు గొడవకు వస్తున్నారని ఈ విషయాన్ని డిపో మేనేజర్‌కు తెలియజేశామన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి ఆర్టీసీ బస్‌లను లోపలకు వచ్చేలా చూడాలని కోరారు.

మరిన్ని వార్తలు