లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. క్వారంటైన్‌కు ఐటీ ఉద్యోగులు

28 Mar, 2020 11:55 IST|Sakshi

సాక్షి, కొవ్వూరు/రాజమండ్రి : లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి తెలంగాణ నుంచి ఏపీకి చేరుకున్న 58 మంది ఐటీ ఉద్యోగులను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం అన్నవరం కొండపైన క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ పటిష్టంగా అమలవుతోంది. లాక్ డౌన్ ఉల్లంఘించిన అందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
(కరోనా : కేంద్ర బలగాలు రావట్లేదు) 

గురువారం కూడా ఏపీకి చేరుకున్న సుమారు 250 మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులను పోలీసులు బొమ్మూరులోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. వీరందరికి డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో సరిత ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు నిర్వహించి.. క్వారంటైన్‌ ముద్రవేశారు  హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో తమ సొంత స్థలాలకు వెళ్లేందుకు వచ్చిన వారికి సరిహద్దుల్లోనే వైద్య పరీక్షలు చేయాలని రాష్ట్ర హైకోర్టు కూడా సూచించింది. వారు బయట తిరిగేందుకు వీలులేదని తేలితే అటువంటి వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది. మిగిలిన వారి నుంచి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటామన్న లిఖితపూర్వక హామీని తీసుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే..
(ఏపీ: కరోనాపై మంత్రుల కమిటీ భేటీ)

మరిన్ని వార్తలు