సాక్షి, వైఎస్సార్ కడప: టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంటిపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. ద్వారక నగర్లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను పెద్ద సంఖ్యలో శ్రీనివాసులరెడ్డి ఇంటి చుట్టూ మొహరించారు. హైదరాబాద్లోని పంజాగుట్టలో ఉన్న ఆయన కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో శ్రీనివాసులరెడ్డి చేపట్టిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన పత్రాలను ఐటీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పన్ను ఎగవేసినట్టు ప్రాథమికంగా గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు నేరుగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఏమేరకు పన్ను ఎగవేశారన్నది సోదాల్లో తేలనుంది.