సాక్షి, చిత్తూరు : సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంటు అసోసియేషన్ (అపుస్మా) జిల్లా సభ్యులు అన్నారు. మంగళవారం ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కేవలం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే అమ్మఒడి పథకం అమలు చేయాలనే కొందరి వాదన సరికాదన్నారు. పలు రంగాల్లో రాణిస్తున్న 90 శాతం మంది ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకుని వచ్చిన వారే అని వెల్లడించారు. కూలీ పని చేసుకుని జీవనం సాగించే వారు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను తాము కించపరచడం లేదని అభిప్రాయపడ్డారు. నిబంధనలు పాటించకుండ ఉన్న కార్పొరేట్ స్కూళ్లను అధికార యంత్రాంగం కట్టడి చేయాలని కోరారు. ప్రతి తల్లి ఖాతాలో రూ.15 వేలు ఏడాదికి జమచేస్తామని చెప్పడం హర్షణీయమన్నారు. సమావేశంలో సభ్యులు ఎస్ఎస్కే రాజా, గోపాలకృష్ణమూర్తి, తేజోమూర్తి, రమణ తదితరులు పాల్గొన్నారు.