బ్రాహ్మణులకు ఆర్థిక,రాజకీయ సాధికారత లేదు

11 Sep, 2018 03:30 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: బ్రాహ్మణులు పేరుకు ఉన్నత సామాజిక వర్గమే అయినప్పటికీ చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆర్థిక, రాజకీయ సాధికారిత లేదు. గడిచిన 50 – 60 ఏళ్లలో ఏదైనా వర్గం బాగా నష్టపోయిందంటే అది బ్రాహ్మణ జాతే. బ్రాహ్మణుల్లో ఎంట్రప్రెన్యూర్స్‌ చాలా తక్కువ. గవర్నమెంట్‌ జాబ్స్‌పై ఆధారపడతారు. ఇప్పుడు వాళ్లకు ఆ అవకాశాలు కూడా లేవు. టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు ఒక ఘటన నన్ను బాగా కలిచివేసింది. రామాలయంలో పనిచేసే అర్చకుడు ఆభరణాలు తాకట్టు పెట్టారని ఆయనపై క్రిమినల్‌ కేసులు పెట్టారు. ఆరోజు ఆయన ఇంట్లో పరిస్థితి చూస్తే జాలేసింది. ఈ ఘటనతోనే అర్చకులకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు తక్కువ కాకుండా గౌరవ వేతనం ఇవ్వాలని ప్రపోజల్‌ పెట్టా. దేవాలయాలను బట్టి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వచ్చేలా చూశాం. ప్రధాన అర్చకులకు రూ.50 వేలు పెట్టాం. ఆ రోజు ఇప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి ఎంతో సపోర్టు చేశారు. పెద్ద ఆలయాల నుంచి చిన్న ఆలయాలకు నిధులు ఇచ్చి తద్వారా ఆ  అర్చకులనూ ఆదుకోవాలి. ఇందుకోసం ఆనాడు నేను తీసుకొచ్చిన జీవో 76ను ఒక లెవల్‌కు తీసుకొచ్చాక ఆగిపోయింది. 

ప్రజలు తిరగబడాల్సిన పరిస్థితి : అర్చకుల పేరిట ఉన్న సర్వీస్‌ ఈనాం ల్యాండ్స్, దేవుని పేరిట ఉన్న ల్యాండ్స్‌ను కాపాడాలి. ఇదే ఆలోచనతో కార్పొరేషన్‌లో ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ను ఏర్పాటు చేశాను. రిటైర్డ్‌ ఎస్పీ, రిటైర్డ్‌ ఆర్డీవోను, ఒక ఎక్స్‌పర్ట్‌ లీడర్‌ను పెట్టాను. గుడవర్తి పద్మావతి కేసులో ఈ కమిటీ పర్‌ఫెక్ట్‌గా పని చేయాల్సిన అవసరం ఉంది. ఆమె సోషల్‌ మీడియాలో వీడియో పెట్టారని కేసు పెడతారా..? ప్రజలు తిరగబడాల్సిన పరిస్థితి ఉంది. అర్చక వృత్తిలో బ్రాహ్మణులొక్కరే కాదు.. ఇతర కులాల వారు కూడా చాలా మంది ఉన్నారు.

వారందరినీ ఆదుకోవాలి.  ట్రస్ట్‌ బోర్డులను ధార్మికచింతన ఉన్న వారికే అప్పగించాలి. 2007లో స్థానికంగా ట్రస్ట్‌ బోర్డులు ఏర్పాటు చేయడం, అర్చకులకు వారసత్వ హక్కులు పునరుద్ధరించేందుకు రాజశేఖరరెడ్డి గారు చట్టం తీసుకొచ్చారు. బ్రాహ్మణులకు రాజకీయ సాధికారత లేకపోవడం వలన చాలా నష్టపోతున్నాం. మా జనాభా మూడు శాతం ఉందనుకున్నా ఏడుగురు ఎమ్మెల్యేలుండాలి. కానీ ఒక్కరే ఉన్నారు. ఇండైరెక్ట్‌ ఎలక్షన్స్‌లో మాలాంటి చిన్న చిన్న కమ్యూనిటీ వారికి అవకాశాలు కల్పించాలి. చివరగా..  పచ్చ మీడియాను డిజప్పాయింట్‌ చేస్తున్నా. నేను పార్టీలోకి చేరడానికి ఇక్కడకు రాలేదు..నా వ్యూస్‌ను పంచుకునేందుకు ఇక్కడకు వచ్చా.   
 – ఐవైఆర్‌ కృష్ణారావు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి    

మరిన్ని వార్తలు