రాజధాని అంటే సినిమా సెట్టింగ్‌ కాదు...

24 Oct, 2017 12:29 IST|Sakshi

సాక్షి, అమరావతి:  రాజధాని అంటే సినిమా సెట్టింగ్‌ కాదని, ఇబ్బందులు వస్తే నష్టపోయేది ప్రజలే అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు. రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి నిర్లక్ష్యంగా ఉందన్నారు. స్విస్‌ ఛాలెంజ్‌ విధానం లోపభూయిష్టంగా ఉందని ఐవైఆర్‌ వ్యాఖ్యానించారు. సరైన ప్లానింగ్‌ లేకపోవడం వల్లే రాజధాని నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఇంతకీ రాజధాని నిర్మాణానికి దర్శకులెందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. ముందు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలని ఆయన సూచించారు.

కాగా  ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి  ఈ నగరం డిజైన్ల బాధ్యతను మొదట జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్‌కి అప్పగించారు. ఆ సంస్థ అందించిన డిజైన్లు అద్భుతమంటూ ఆకాశానికెత్తి, ఆ తర్వాత ఆ డిజైన్లు బాగోలేవంటూ మకిని తొలగించారు. ఆ తర్వాత లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఐదారుసార్లు డిజైన్లు రూపొందించినా ముఖ్యమంత్రికి నచ్చలేదు. చివరకు ఫోస్టర్‌ సంస్థకు సలహాలిచ్చి డిజైన్లు రూపొందించే బాధ్యతను బాహుబలి దర్శకుడు రాజమౌళికి అప్పగించారు. ఆ డిజైన్లు ఎప్పుడు వస్తాయో, అమరావతి నిర్మాణం ఎప్పటికి సాకారమవుతుందో అంతుచిక్కడం లేదు.

మరిన్ని వార్తలు