దళితుల లోగిళ్లలో వెలుగులు

11 Nov, 2017 07:06 IST|Sakshi

 వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఉచిత విద్యుత్తు  

 ‘ప్రజా సంకల్పం‘లో ప్రకటించిన వైఎస్‌ జగన్‌  

 ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారుల ఇళ్లకు సరఫరా  

 జిల్లాలో 1.65 లక్షల వినియోగదారులకు లబ్ధి

బాబు జమానాలో ఇలా...
దళితుల గృహాలకు నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగం జరిగితే అందులో 75 యూనిట్లకు రాయితీ ఇస్తున్నారు.
మిగతా 25 యూనిట్లకు బిల్లు వేస్తున్నారు.
75 యూనిట్ల తర్వాత 100 యూనిట్ల వరకు
ప్రతి యూనిట్‌కు రూ.2.60 చార్జి వసూలు చేస్తున్నారు.
75 యూనిట్ల తర్వాత 10 యూనిట్లు వాడుకుంటే రూ. 26,
ఒక్క యూనిట్‌ వాడుకుంటే రూ.2.60 లెక్కన చెల్లించాలి.
నెలలో 100 యూనిట్ల కన్నా ఒక్క యూనిట్‌
ఎక్కువ ఉపయోగించుకున్నా రాయితీ హుష్‌కాకే...

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే...
ఎలాంటి షరతులూ లేకుండా ప్రతి దళితునికి
ఇంటి అవసరాలకు ఉచిత విద్యుత్తు ఇస్తామని హామీ...
అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని వైఎస్‌ జగన్‌ స్పష్టీకరణ
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు మొత్తం 1,65,450 మంది
 ఇందులో అధిక శాతం మంది పరిమితులకు లోబడే రాయితీ పొందుతున్నారు
 వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ అమలులోకి వస్తే ఎస్సీ, ఎస్టీలందరికీ ఉచితంగా విద్యుత్తు అందనుంది.

సాక్షి, రాజమహేంద్రవరం: దళితుల లోగిళ్లలో త్వరలో వెలుగులు విరజిమ్మనున్నాయి. ప్రతి దళితుడి ఇంటికీ ఉచితంగా విద్యుత్తు సరఫరా కానుంది. రాష్ట్రంలోని దళితవాడలకు ఉచిత విద్యుత్తు ఇస్తామని ‘ప్రజా సంకల్ప పాదయాత్ర’లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దళితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు దళితుల గృహాలకు వినియోగించే విద్యుత్తుపై పరిమితులతో కూడిన రాయితీలున్నాయి. దళితుల గృహాలకు నెలకు 100 యూనిట్లులోపు విద్యుత్తు వినియోగం జరిగితే అందులో 75 యూనిట్లు రాయితీ ఇస్తున్నారు. మిగతా 25 యూనిట్లకు బిల్లు వేస్తున్నారు. 75 యూనిట్ల తర్వాత 100 యూనిట్ల వరకు ప్రతి యూనిట్‌కు రూ.2.60 చార్జి వసూలు చేస్తున్నారు. 75 యూనిట్ల తర్వాత 10 యూనిట్లు వాడుకుంటే రూ. 26, ఒక్క యూనిట్‌ వాడుకుంటే రూ.2.60 లెక్కన చెల్లించాలి. నెలలో 100 యూనిట్ల కన్నా ఒక్క యూనిట్‌ ఎక్కువ ఉపయోగించుకున్నా వారికి ఎలాంటి రాయితీ ఉండదు. ఈ నేపథ్యంలో ఎలాంటి షరతులూ లేకుండా ప్రతి దళితునికి ఇంటి అవసరాలకు ఉచిత విద్యుత్తు ఇస్తామని జగన్‌ ప్రకటించారు.

1.65 లక్షల లబ్ధిదారులకు ప్రయోజనం...
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు మొత్తం 1,65,450 మంది ఉన్నారు. వీరిలో 1,03,599 మంది ఎస్సీ వినియోగదారులు, 61,851 ఎస్టీ వినియోగదారులున్నారు. 100 యూనిట్లులోపు విద్యుత్తు ఉపయోగిస్తున్న ఎస్సీలు 84,797 మంది ఉన్నారు. వీరికి 75 యూనిట్లు రాయితీ లభిస్తోంది. ఫలితంగా నెలకు రూ.99.14 లక్షలు లబ్ధి కలుగుతోంది. ఎస్టీ వినియోగదారుల్లో 100 యూనిట్లులోపు విద్యుత్‌ను ఉపయోగిస్తున్న వారు 50,900 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.39.73 లక్షలు లబ్ధి జరుగనుంది. ప్రస్తుతం 1,65,450 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల్లో 1,35,697 మందికే రాయితీ లభిస్తోంది. వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ అమలులోకి వస్తే ఎస్సీ, ఎస్టీలందరికీ తమ గృహాలకు ఉచితంగా విద్యుత్తు అందనుంది.   

ఉచిత విద్యుత్తుతో మాకు కలుగుతుంది..
జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే  ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తు ఇస్తానని ప్రకటించడం చాలా సంతోషించదగిన విషయం. కూలీనాలీ చేసుకుని, తిండి గింజల కోసం కష్టపడే మాలాంటి ఎందరో గిరిజన ప్రజలకు ఇది చాలా ఊరటనిచ్చే విషయం. నెలనెలా వచ్చే  విద్యుత్తు బిల్లులు చెల్లించే స్థోమత లేక విద్యుత్తు కనెక్షన్‌ తొలగించుకునే పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది ఎస్టీలకు దీనివల్ల ఎంతో మేలు కలుగుతుంది.
– కొట్టి కన్నంరాజులు, నాయకపోడు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

ఉచిత విద్యుత్తుతో దళిత వాడలకు ఊతం
వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటన రాష్ట్రంలో వేలాది దళితవాడలకు ఊతంగా నిలుస్తుంది. దళితుల సామాజిక, ఆర్థిక సమస్యలు తెలిసిన నేతగా జగన్‌ మెహన్‌రెడ్డి ఈ హామీ ఇవ్వడం ఉపయుక్తమైన ఆలోచన. నేటికీ అనేక దళిత వాడల్లో అనేక మంది దళితులు విద్యుత్‌ బిల్లుల చెల్లింపు భారంగా ఉంది. నాడు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే ఆయన తనయుడిగా జగన్‌ మోహన్‌రెడ్డి దళిత వాడలకు ఉచిత విద్యుత్‌ ఇస్తానడడం అభినందనీయం.
– కందికట్ల రమణ, దళిత యువకుడు, అమలాపురం

మరిన్ని వార్తలు