టీడీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి

24 Mar, 2019 12:40 IST|Sakshi
 సభలో ప్రసంగిస్తున్న ధర్మాన ప్రసాదరావు  

సాక్షి, వజ్రపుకొత్తూరు/ వజ్రపుకొత్తూరు రూరల్‌/ కాశీబుగ్గ: రాష్ట్రంలో అరాచక పాలన తీసుకొచ్చిన తెలుగుదేశం ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, రాష్ట్ర విభజన అనంతరం అనుభవజ్ఞుడు కదా అని ప్రజలు అధికా రం ఇస్తే అడ్డుగోలుగా పాలించి దోచుకుతిన్నారని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోర్డినేటర్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పలాసలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నిన్న డాక్టర్‌ సీదిరి అప్పలరాజు నామినేషన్‌తో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయని, నేడు అది మరింత ఎక్కువైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 23 కేంద్ర సంస్థలను ఇస్తే అందులో ఒక్కటైనా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయలేద ని విమర్శించారు. తిత్లీ తుపాన్‌ ఉద్దానం, తీర, మైదాన ప్రాంతా లను కకావికలం చేస్తే ఆదుకో వాల్సిన ప్రభుత్వ పెద్దలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని స్వాహా చేసి బాధితుల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. 


కదిలించిన దువ్వాడ ప్రసంగం
అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి అచ్చెన్నాయుడు తన ఆర్థిక మూలాలపై దాడులు చేసి, కష్టనష్టాల పాల్జేశారని, ఆర్ధికంగా చితికి పోయి సామాన్య జీవితం గడుపుతున్న తనను.. నేనున్నానంటూ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీ సీటిచ్చి ఆదుకున్నారని.. దువ్వాడ శ్రీనివాస్‌ చేసిన ప్రసంగం సభికులను కది లించింది. నాయకుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని, జనం మనిషిగా నిత్యం వారి మధ్యనే ఉంటూ ప్రజా సేవకు అంకితమవుతానని చెప్పారు. జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్ల వంతున ఐదేళ్లలో రూ.250 కోట్లు కేంద్ర సహాయం అందాయ ని, ఎంపీ ల్యాడ్స్‌ నుంచి మరో రూ.100 కోట్లు వరకు మంజూరైతే ఆ నిధులు ఖర్చు చేసేందుకు మన ఎంపీ రామ్మోహన్‌నాయుడికి తీరికలేకపోయిందని ధ్వజమెత్తారు. 


గౌతు కుటుంబంతో కుంటుపడ్డ అభివృద్ధి
పలాస ప్రజలకు గౌతు కుటుంబమే పెద్ద సమస్యని, వారి వల్ల అభివృద్ధి కుంటుపడిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. అవినీతి, అరాచకం, అణిచివేత అనే రుగ్మతలతో ప్రజలు బాధ పడుతున్నారన్నారు. ఓటు అనే మందుతో ఈ జబ్బును నయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో మత్స్యకారుల జీవనం దుర్భరంగా ఉందని, భావనపాడు, నువ్వలరేవు ప్రాంతాల్లో జెట్టీ కావాలని వారు కోరుతున్నారని, అధికారంలోకి రాగానే వాటి నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని జగన్‌మోహన్‌రెడ్డిని డాక్టర్‌ సీదిరి కోరారు. ఉద్దానంలో పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారని, వైఎస్సార్‌ హయాంలో అప్పటి ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌కు రూపకల్పన చేసినప్పటికీ నేటి వరకు అది సాకారం కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, ఆమదాలవలస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, రాజాం ఎమ్మెల్యే అభ్యర్థులు తమ్మినేని సీతారాం, పేరాడ తిలక్, రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్, కంబాల జోగులు, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు హనుమంతు వెంకటరావు దొర, మామిడి శ్రీకాంత్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వడిశ హరిప్రసాద్, జిల్లా కార్యదర్శులు దువ్వాడ హేమబాబు చౌదరి, బళ్ల గిరిబాబు, డొక్కరి దానయ్య, మెట్ట కుమార స్వామి, ఉంగ సాయి కృష్ణ, అగ్ని కుల క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుడు జుత్తు నీలకంఠం, పార్టీ పట్టణ అధ్యక్షుడు దువ్వాడ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


ఘన స్వాగతం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పలాసలో నిర్వహించే బహిరంగ సభకు విచ్చేసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దుశ్శాలువతో సత్కరించి పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, సీఈసి సభ్యులు అంధవరపు సూరిబాబు ఆహ్వానం పలికారు. 

మరిన్ని వార్తలు