ఆ పనులన్ని పూర్తి చేయాలి: సీఎం జగన్‌

8 May, 2020 18:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదితో సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఉపాధిహామి పనులకు సంబంధించిన విషయాలను సీఎం జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా ఉపాధి హామీ పనులు మందగించాయని అధికారులు  జగన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. భౌతిక దూరం పాటిస్తూ పనులు మొదలుపెట్టామని, ఇప్పుడిప్పుడే పనులు వేగం పుంజుకుంటున్నాయని తెలిపారు. (మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్)

 వర్షాలు వచ్చే లోపు వీలైనన్ని పని దినాలు కల్పించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వీలైనన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలన్నారు. గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు అత్యంత ప్రాధాన్యమైనవని జగన్‌ అన్నారు. వీటి నిర్మాణాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు జూలై 31 కల్లా పూర్తి చేస్తామని అధికారులు జగన్‌కు చెప్పారు. అదేవిధంగా 16,208  వార్డు, గ్రామ సచివాలయ పోస్టులు ఖాళీగా ఉన్నాయనిఅధికారులు సీఎంకి నివేదించారు. పరీక్షలకు అనుమతులు రాగానే భర్తీ చేస్తామన్నారు. 2021 మార్చి 31 నాటికి రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గ్రామ సచివాలయాల నిర్మాణం ఆగస్టు 31 కల్లా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని కూడా అధికారులు తెలిపారు. అదేవిధంగా వాటర్‌ గ్రిడ్‌పైనా కూడా సీఎం జగన్‌ సమీక్షించారు. (మరింత సక్సెస్పుల్గా టెలి మెడిసిన్..)

మరిన్ని వార్తలు